పుణ్య‌కాలం కాస్త ముగిశాక‌.. ప‌ట్టాభిషేక‌మా?

ఇప్ప‌టికే ఎన్నో దెబ్బ‌లు తిని తిరిగి పుంజుకునేందుకు ఆప‌సోపాలు ప‌డుతున్న కాంగ్రెస్ ప్ర‌స్తుత ఆలోచ‌నా విధానం ఏమిటో ఎవ‌రికీ అర్థం కాకుండా ఉంది. వ‌రుస‌గా రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ ఓడిపోయింది. అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఒక్కొక్కటిగా చేయి జారిపోతున్నాయి. ఇప్పుడు పంజాబ్‌, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మాత్ర‌మే ఆ పార్టీ అధికారంలో ఉంది. అక్క‌డ కూడా ప‌రిస్థితులు పార్టీకి ప్ర‌తికూలంగా మారుతున్నాయ‌నే టాక్‌.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాలంటే ఇప్ప‌టి నుంచే అందుకు స‌న్న‌ద్ధ‌మ‌వాల్సి ఉంటుంది. అందుకు వ‌చ్చే ఏడాది జ‌రిగే అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకోవాల్సి ఉంది. వ‌చ్చే ఏడాది దేశ రాజకీయాల్లో కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తో పాటు ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, గోవా, మ‌ణిపూర్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఆ ఎన్నిక‌ల‌కు ఇంకా కొన్ని నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. దీంతో అధికార బీజేపీతో స‌హా ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఎన్నిక‌లపై ఫోక‌స్ పెట్టాయి.

ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ మాత్రం విభిన్నంగా ఆలోచిస్తోంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే జాతీయ అధ్య‌క్షుడిగా తిరిగి రాహుల్ గాంధీని ఎన్నుకుని ఆ అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు పార్టీ వెళ్లాలి. కానీ వ‌చ్చే ఏడాది సెప్టెంబ‌ర్ లోపు రాహుల్ గాంధీని మళ్లీ అధ్య‌క్ష పీఠంపై కూర్చోబెట్టి 2024 ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతామ‌ని ఆ పార్టీ చెబుతోంది. దీంతో పుణ్యకాలం కాస్త ముగిశాక రాహుల్ పట్టాభిషేకం జ‌రిగి ఏం ఉప‌యోగ‌మ‌నేది విశ్లేష‌కుల ప్ర‌శ్న‌. రాహుల్ గాంధీ అధ్య‌క్ష సార‌థ్యంలో అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం పార్టీ పోరాడితే మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై వ్య‌తిరేక‌త పెరుగుతోంది. దీన్ని క్యాష్ చేసుకోవ‌డానికి కాంగ్రెస్ తొంద‌ర‌ప‌డాలి. ఎలాగో రాహుల్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు తిరిగి స్వీక‌రిస్తాడ‌ని అంటున్నారు క‌దా మ‌రి అదేదో ఇప్పుడే చేప‌ట్ట‌వ‌చ్చు క‌దా అని నిపుణులు అంటున్నారు. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో పార్టీకి మెరుగైన ఫ‌లితాలు వ‌స్తే కాంగ్రెస్ ఆత్మ‌విశ్వాసం పెర‌గ‌డ‌మే కాకుండా.. సార్వ‌త్రిక ఎన్నిక‌లపైనా అది సానుకూల ప్ర‌భావాన్ని చూపుతుంది. మ‌రి ఈ విష‌యాన్ని కాంగ్రెస్ ఎప్పుడు అర్థం చేసుకుంటుందో చూడాల‌ని విశ్లేష‌కులు అంటున్నారు.