అయ్యో మోత్కుప‌ల్లి.. ఆ చ‌ప్పుడే లేదు!

కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు పేరు టీఆర్ఎస్ వ‌ర్గాల‌తో పాటు మీడియాలోనూ ఎక్కువ‌గా వినిపించింది. ద‌ళిత బంధు కోసం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో ఆయ‌న సీఎం ప‌క్క‌న కూర్చోవ‌డం.. ఆ త‌ర్వాత అసెంబ్లీలో ప్ర‌సంగం స‌మ‌యంలోనే మోత్కుప‌ల్లి శాస‌న‌స‌భ‌కు వెళ్ల‌డం లాంటి విష‌యాలే అందుకు కార‌ణం. ఆయ‌న్ని టీఆర్ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్ ద‌ళిత బంధు ఛైర్మ‌న్‌గా చేస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఓట‌మి త‌ర్వాత కేసీఆర్.. ద‌ళిత బంధు ఊసే ఎత్త‌క‌పోవ‌డంతో అస‌లు మోత్కుప‌ల్లి ప‌రిస్థితి ఏంటీ అన్న‌ది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

కేసీఆర్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో ఎవ‌రికి అంతు చిక్క‌ద‌ని అంటుంటారు. పార్టీ గెలుపు కోసం ఆయ‌న అనూహ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఇటీవ‌ల ఆయ‌న ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యం కోసం మిగ‌తా పార్టీలకు చెందిన కీల‌క నేత‌ల‌ను పార్టీలో చేర్చుకున్నారు. అందులో కౌశిక్ రెడ్డి, పెద్దిరెడ్డి లాంటి నాయ‌కులున్నారు. మ‌రోవైపు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మోత్కుప‌ల్లిపై కూడా క‌న్నేసిన కేసీఆర్.. ఆయ‌న మెడ‌లో గులాబీ కండువా క‌ప్పేశారు. దీంతో ఆయ‌న‌కు కేసీఆర్ ఏదో మంచి ప‌ద‌వే క‌ట్ట‌బెడ‌తార‌నే ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా ద‌ళిత బంధు ప‌థ‌కం ప‌ర్య‌వేక్ష‌ణ ఆయనే చూసుకుంటార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

మోత్కుప‌ల్లి టీఆర్ఎస్‌లో చేర‌క‌ముందే కేసీఆర్ ద‌ళిత బంధుపై చేప‌ట్టిన స‌మీక్ష‌లో ఆయ‌న పాల్గొన్నారు. దీంతో ద‌ళిత బంధు ప‌థ‌కానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించి దానికి ఛైర్మ‌న్‌గా మోత్కుప‌ల్లిని నియ‌మించాల‌నే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగింది. ఆ ప‌ద‌వికి కేబినేట్ హోదా కూడా ర్యాంకు కూడా క‌ల్పిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఓట‌మి త‌ర్వాత కేసీఆర్ అస‌లు ద‌ళిత బంధు ప్ర‌స్తావ‌నే చేయ‌డ‌మే లేదు.

ఆ ప‌థ‌కాన్ని క‌చ్చితంగా అమ‌లు చేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ దానిపై స‌మీక్ష కూడా నిర్వ‌హించ‌లేదు. దీంతో ఇదే అదునుగా తీసుకుని ఈ విష‌యంపై విప‌క్షాలు అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వంలో ప్రాధాన్య‌త క‌లిగిన ప‌ద‌వి వ‌స్తుంద‌ని భావించిన మోత్కుప‌ల్లి ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయార‌నే చ‌ర్చ సాగుతోంది. బ‌య‌ట ఎక్కువగా క‌నిపించ‌డం లేదు.  ప‌రిస్థితులు ఎలా ఎన్నా కేసీఆర్ మాత్రం త‌న‌కు న్యాయ‌మే చేస్తార‌ని ఆయ‌న అనుకుంటున్న‌ట్లు స‌మాచారం.