కేసీఆర్ తో మోడీ డీల్… అందుకే రేపు ఎంపీలు డుమ్మా – రేవంత్

టీఆర్‌ఎస్ ఎంపీలు ఉభయసభల్లో నాటకం ఆడుతున్నారని టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదని తప్పుబట్టారు.

కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన పేరుతో గాంధీ విగ్రహం వద్ద పదినిమిషాలు.. లోక్ సభలో పోడియం వద్ద పదిహేను నిమిషాలు చేస్తున్నారనే తప్ప… వీరి నిరసనలో నిజాయతీ లేదని విమర్శించారు. దున్నపోతు మీద వానపడితే తోకైనా ఆడిస్తాదని, అయితే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతుకంటే హీనంగా ఉందని ధ్వజమెత్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సెంట్రల్ హాల్ ప్రస్తావన తెచ్చారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ ను కాలేజీల్లో క్యాంటిన్ తో పొల్చారు. అలాంటి ప్రదేశంలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఫొటో దిగి తాము పార్లమెంట్ లో నిరసన తెలుపుతున్నామని తెలంగాణ సమాజాన్ని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ఎంపీలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వమే దోషి అని కేసీఆర్ భావిస్తే.. ఆయన ఎందుకు ఢిల్లీలో నిరసన తెలుపలేదని ప్రశ్నించారు. గతంలో మోదీ మెడలు వంచుతానని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. ప్రధానిని, ధాన్యం కొలుగోలుకు సంబంధించిన మంత్రిని ఎందుకు ఆయన నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు ఢిల్లీకి వెళ్లడం లేదు. ప్రగతిభవన్ లో పడుకున్నారా లేక ఫాం హౌస్ లో ఉన్నారా అని నిలదీశారు.

రాష్ట్రంలో 25 వేల మెట్రిన్ టన్నుల బియ్యం మాయమైతే కేంద్రం ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుంటే బీజేపీ ఎందుకు రాష్ట్రాన్ని కాపాడుతోందని నిలదీశారు.

పటి నుంచి టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన తెలుపరని, ఇప్పటికే అందరినీ హైదరాబాద కు రమ్మని కేసీఆర్ ఆదేశాలిచ్చారని తెలిపారు. ఎందుకంటే కేంద్రం నుంచి కేసీఆర్ కు ఆదేశాలు వెళ్లాయని చెప్పారు. కేంద్ర ఆదేశాల మేరకు రేపు టీఆర్‌ఎస్ ఎంపీలు హడావిడి చేసి లోక్ సభ, రాజ్యసభ నుంచి మాయమవుతున్నారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతులు ఆగమవుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కుప్పలపై రైతులు గుండెలు ఆగి చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందు రాలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు.