తెలంగాణ ఎంపీల‌ను చూసి నేర్చుకోండి

ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రానికి నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌, కేంద్రం నుంచి అందాల్సిన వాటా.. ఇలా పార్ల‌మెంట్‌లో కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీల‌కు చాలా స‌మ‌స్య‌లే ఉన్నాయి. కానీ శీతాకాల స‌మావేశాల్లో భాగంగా కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును ఏపీ ఎంపీలు త‌మ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌శ్నించ‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార వైసీపీతో పాటు ప్ర‌తిప‌క్ష టీడీపీ ఎంపీలు కూడా ఎలాంటి నిర‌స‌న‌లు తెలియ‌జేయ‌డం లేదు. దీంతో ప‌క్క రాష్ట్రం తెలంగాణ ఎంపీలు చూసి నేర్చుకోవాల‌ని ఎంపీల‌కు ఏపీ ప్ర‌జ‌లు హిత‌వు ప‌లుకుతున్నారు.

వాళ్లు వాకౌట్లు చేస్తుంటే..
వ‌రి కోనుగోళ్ల విషయంపై కేంద్రం వైఖ‌రి స్ప‌ష్టం చేయాల‌ని పార్ల‌మెంట్ స‌మావేశాలు మొద‌లైన రోజు నుంచి టీఆర్ఎస్ ఎంపీలు ఇటు లోక్‌స‌భ‌, అటు రాజ్య‌స‌భ‌లో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రుల‌కు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. కేంద్రం తీరుపై ఆగ్ర‌హంతో వాకౌట్ కూడా చేస్తున్నారు. కానీ ఏపీకి స‌మ‌స్య‌లే లేవ‌న్న‌ట్లు.. కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే అంశాలే దొర‌క‌డం లేద‌న్న‌ట్లు ఆ రాష్ట్ర ఎంపీలు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ మోడీని ఎదిరించే సాహ‌సం చేయ‌లేక‌పోతున్నాయి. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం  కూడా ప్ర‌శ్నించ‌లేక‌పోతున్నాయి. మ‌రి అందుకు కార‌ణం ఏమై ఉంటుంద‌నే చ‌ర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.

బీజేపీ బిందాస్‌..
ఏపీలో సీఎం జ‌గ‌న్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుది ఒక‌టే ల‌క్ష్యం. అదే ముఖ్య‌మంత్రి పీఠం. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ గెలిచి దాన్ని కాపాడుకోవాల‌ని జ‌గ‌న్‌.. 2024 ఎన్నిక‌ల్లో ఎలాగైనా తిరిగి సీఎం కావాల‌ని బాబు అడుగులు వేస్తున్నారు. వీళ్ల ఇద్ద‌రి ప‌రిస్థితి చూస్తున్న బీజేపీ బిందాస్‌గా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాష్ట్రంలో అధికారం కోసం కొట్టుకునే ఈ పార్టీలు ఇక కేంద్రాన్ని ఏం ప్ర‌శ్నిస్తాయ‌నేదే అందుకు కార‌ణం. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీల్లో ఏది గెలిచినా బీజేపీకే వాటిల్లే న‌ష్ట‌మేమీ ఉండ‌దు. అందుకే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో బీజేపీ దాట‌వేత ధోర‌ణి అవ‌లంబిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఒక‌రినొక‌రు అనుకోవ‌డ‌మే..
రాష్ట్రంలో ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌లు చేసుకునేందుకే వైసీపీకి, టీడీపీకి స‌మ‌యం స‌రిపోవ‌డం లేదు. ఇక రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రంలో ఏం కొట్లాడుతారంటూ ప్ర‌జ‌ల నుంచి అస‌హ‌నం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌త్య‌ర్థి పార్టీని అణిచివేసేందుకు జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా గెల‌వ‌డం అనే దాని మీద బాబు దృష్టి పెట్టారు. దీంతో రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను అధికార‌, విప‌క్ష నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. అందుకే పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్నా మోడీ స‌ర్కార్‌ను నిల‌దీసే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. వివిధ అంశాల‌పై స‌భ‌ను స్థంభింప చేసే సాహసం చేయ‌డం లేదు. కేవ‌లం ప్ర‌శ్న‌లు వేయ‌డం మిన‌హా ఎలాంటి నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డం లేదు.