వాన‌దేవుడిదే త‌ప్పు.. ఆయ‌న‌పైనే కేసుపెట్టాలి: ఏపీ మంత్రి

ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయి? అంటే.. ఠ‌క్కున చెప్పే స‌మాధానం.. మ‌హా ద‌రిద్రంగా ఉన్నాయ‌నే. ఎక్క‌డ ఏమూల‌కు వెళ్లినా.. ఏ చిన్న రోడ్డునుచూసినా.. గుంత‌లు ప‌డి క‌నిపిస్తోంది. ఇక‌, ప్ర‌ధాన రోడ్ల సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ప్ర‌భుత్వం ఆయా రోడ్ల‌ను ప‌ట్టించుకుని.. బాగు చేయాల్సిన అవ‌స‌రం ఉన్నా.. నిధులు లేక‌.. ఆర్థిక ప‌రిస్థితి స‌హ‌క‌రించ‌క ఆపశోపాలు ప‌డుతోంది.

ఈ క్ర‌మంలోనే అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టాక‌.. ఖ‌చ్చితంగా బాగు చేస్తామ‌ని.. ప్ర‌క‌ట‌న‌లు జారి చేసింది. అయితే.. తాజాగా ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

ఏపీ రోడ్లుఏంటి సార్ అధ్వానంగా ఉన్నాయి? అన్న మీడియా ప్ర‌శ్న‌కు నారాయ‌ణ స్వామి.. చిత్ర‌మైన స‌మాధానం ఇచ్చారు. “ఇదంతా ఆ వాన‌దేవుడి త‌ప్పు! వ‌ర్షాలు బాగా కురుస్తున్నందునే రోడ్లు బాగా చెడిపోతున్నాయి. ఏదైనా కేసు పెట్టాలంటే.. ఆయ‌న‌పైనే పెట్టండి. ” అంటూ.. కామెంట్లు విసిరారు.

అదేస‌మయంలో ప‌నిలో ప‌నిగా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబును కూడా విమ‌ర్శించేశారు. బాబుకు పాల‌న చేత‌కాద‌ని.. ఆయ‌న కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గాన్ని బాగు చేసుకునేందుకు అధికారం కోసం వెంప‌ర్లాడుతున్నాడ‌ని.. ఆయ‌న కుమారుడిని సీఎం సీటులో కూర్చోబెట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. కేవలం అధికారం మీదే త‌ప్ప‌.. ప్ర‌జ‌లపై ఆయ‌నకు దృష్టి లేద‌న్నారు.

చంద్రబాబు దుష్టపాలనను అంతమొందించడానికే భగవంతుని స్వరూపంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారని నారాయ‌ణ‌స్వామి చెప్పారు. టీడీపీ ప్రభుత్వం నాణ్యతలేని రోడ్లు వేసి దోచేసుకున్నారని ఆరోపించారు. కాబట్టే ఆ వరుణదేవుడు కూడా వారికి బుద్ధి రావడానికి రోడ్లను ఇలా పాడు చేశాడని అన్నారు. ఏదైనా కేసు పెట్టాల్సి వ‌స్తే.. ఆయ‌న‌పైనే కేసు పెట్టాల‌న్నారు.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ లేనప్పుడు రెచ్చగొట్టేలా ప్రవర్తించింది చంద్రబాబేనని పేర్కొన్నారు. గొడ్డలి, బాబాయ్, చెల్లి, తల్లి అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడింది చంద్రబాబేనన్నారు. అందుకే మాధవ రెడ్డి, వంగవీటి మోహన రంగా హత్యలపై విచారణ జరిపించాలని వైసీపీ కోరిందన్నారు. దాంతో చంద్రబాబు జీర్ణించు కోలేక పవిత్రమైన భార్యను తెర పైకి తీసుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ చేసుకున్నారని విమర్శించారు.