ఆంధ్రప్రదేశ్‌ విభజనకు వైఎస్సారే ఆద్యుడు: చింతా మోహన్

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉండింటే అసలు తెలంగాణ వచ్చేది కాదని అందరిలో ఉన్న భావన. ప్రత్యేక తెలంగాణ కావాలని కాంగ్రెస్ తీర్మానం చేసినప్పటికీ రాజశేఖర్ రెడ్డి ఉన్నాళ్లు ప్రత్యేక తెలంగాణ వాదం అంత బలంగా వినిపించలేదు. ప్రత్యేక తెలంగాణ కావాలని ప్రజలు కోరుకోవడం లేదని ఆయన అసెంబ్లీలో కూడా చాలాసార్లు ప్రస్తావించారు. ఇదే విషయంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను అసెంబ్లీలో సూటిగా ప్రశ్నించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంత బలంగా ప్రత్యేక తెలంగాణను ఆయన అడ్డుకున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌ విభజనకు రాజశేఖర్‌ రెడ్డే ఆద్యుడని కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. అందుకు సాక్ష్యంగా కొన్ని ఘటనలను ప్రస్తావించారు. 1990 సంవత్సరంలో డిసెంబర్‌ 8,9,10 తేదీల్లో జరిగిన ఘటనలతో విభజన ప్రక్రియకు దోహదమైందన్నారు.

ఆ తర్వాత లెఫ్ట్‌పార్టీలు మినహా.. ఇతర అన్ని రాజకీయపార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడం వల్లనే రాష్ట్రాన్ని విభజించారని తెలిపారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి ఒక్క నిమిషం సమయం కేటాయిస్తే తెలుగురాష్ట్రాలు ఒక్కటైపోతాయని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి అధ్వానంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రజల పరిస్థితులు బాగుండట్లేదన్నారు.

ఆనాడు స్కాలర్‌షిప్పుతోనే ప్రముఖులు చదువుకున్నారని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లుగా 80లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్పులను రాష్ట్రప్రభుత్వం ఆపేసిందని తప్పుబట్టారు. ఇప్పటికైనా విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ప్రభుత్వం విడుదల చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అధికారం, ముఖ్యమంత్రి పదవి.. రెడ్డి, కమ్మ సామాజికవర్గాలే 70 ఏళ్లపాటు అనుభవించారని విమర్శించారు. 2024లో కాపులకు అధికారం వచ్చేలా.. అన్నిపార్టీలను ఏకతాటికి తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే కచ్చితంగా ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉక్కు పరిశ్రమను విక్రయిస్తున్నా సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడకపోవడంతో శోచనీయమన్నారు.

విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయకుండా ఆపేశక్తి కేవలం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందని ఉందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కేబినేట్‌లో పెట్టించి విశాఖ ఉక్కును ప్రభుత్వ పరం చేస్తామని చింతామోహన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితి అస్సలు బాగోలేదని, ప్రభుత్వ సంస్థలు విక్రయిస్తున్నా మాట్లాడలేని స్థితిలో నేతలున్నారని చింతా మోహన్ తప్పుబట్టారు.