ఆ ముగ్గురికి జ‌గ‌న్ ఛాన్స్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై దృష్టి సారించారు. ఏపీలో ఎమ్మెల్యే కోటా కింద మూడు స్థానాల‌కు ఎన్నిక‌ల న‌గారా మోగింది. న‌వంబ‌ర్ 29న పోలింగ్ జ‌రుగుతుంద‌ని ఈసీ షెడ్యూల్ విడుద‌ల చేసింది. దీంతో ఈ మూడు ప‌ద‌వుల కోసం జ‌గ‌న్ ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నే ఆస‌క్తి నెల‌కొంది.

ప‌ద‌వుల కోసం ఆశ పెట్టుకున్న ఆశావ‌హులు జ‌గ‌న్ క‌టాక్షం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే జ‌గ‌న్ ఇప్ప‌టికే ఓ ముగ్గురి పేర్లపై ఓ అంచ‌నాకు వ‌చ్చార‌ని తెలుస్తోంది. ఈ ఏడాది మే 31వ తేదీతో బీజేపీ స‌భ్యుడు సోము వీర్రాజు వైసీపీకి చెందిన గోవింద‌రెడ్డి టీడీపీ నాయ‌కుడు ష‌రీఫ్ ప‌ద‌వీ కాలం పూర్త‌యింది. క‌రోనా కార‌ణంగా ఎన్నిక‌ల‌ను వాయిదా వేసిన ఈసీ ఇప్పుడు షెడ్యూల్ విడుద‌ల చేసింది.

ఇప్పుడు ఆ ప‌ద‌వుల కోసం జ‌గ‌న్ ఎంచుకునే ముగ్గురు అభ్య‌ర్థులు ఎవ‌ర‌నే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే గోవింద‌రెడ్డిని తిరిగి ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఇక మిగ‌తా రెండు స్థానాల కోసం అభ్య‌ర్థుల ఎంపిక‌ పై జ‌గ‌న్ క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే మైనారిటీ కోటా కింద ఇద్ద‌రికి ఛాన్స్ ఇవ్వ‌డంతో ఈ సారి ఆ వ‌ర్గం నేత‌లకు అవ‌కాశం లేన‌ట్లే క‌నిపిస్తోంది. మ‌రోవైపు జిల్లాల స‌మీక‌ర‌ణాల‌ను కూడా జ‌గ‌న్ దృష్టిలో పెట్టుకోనున్నారు. మిగ‌తా రెండు స్థానాలు తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌కు చెందిన‌వి. కానీ ఈ సారి అదే జిల్లాల‌తో ఎమ్మెల్సీ పోస్టుల‌ను భ‌ర్తీ చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.

ఆ జిల్లాల నుంచి ఇటీవ‌లే ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తులు మోషేన్ రాజుల‌ను జ‌గ‌న్ ఎంపిక చేశారు. కాబ‌ట్టి ఈ సారి ఉత్త‌రాంధ్ర కోస్తాంధ్ర నుంచి ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా విశాఖ‌, గుంటూరు నాయ‌కుల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది.

గుంటూరు నుంచి మ‌ర్రి రాజశేఖ‌ర్‌కు జ‌గ‌న్ ఛాన్స్ ఇస్తార‌ని స‌మాచారం. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన రాజ‌శేఖ‌ర్‌కు జ‌గ‌న్ గ‌తంలోనే హామీనిచ్చారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. అందుకే ఈ సారి ఆయ‌న‌కు క‌చ్చితంగా ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇక విశాఖ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ యోగం ద‌క్కే ఆస్కార‌మున్న‌ట్లు తెలుస్తోంది. వంశీకృష్ణ యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. అయితే గ‌తంలో ప్రొద్దుటూరుకు చెందిన ర‌మేశ్ యాద‌వ్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కింది.

దీంతో ఈ సారి యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడికి ఛాన్స్ ద‌క్కే అవ‌కాశాలు త‌క్కువేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆ విష‌యాన్ని జ‌గ‌న్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే దాడి వీర‌భ‌ద్ర‌రావుకు ఛాన్స్ ద‌క్కుతుంద‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ మ‌న‌సులో ఏముందో తేలాలంటే కొంత కాలం ఆగాల్సిందే.