వైసీపీ ఎంపీల‌ను ఓ రేంజ్‌లో ఏకేసిన పీకే

ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎంపీల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఓ రేంజ్‌లో ఏకేశారు. పార్ల‌మెంటు ఎందుకు వెళ్తున్నారు? అని ప్ర‌శ్నించారు. కేవ‌లం క‌ప్పు కాఫీ తాగి వ‌చ్చేందుకు వారు పార్ల‌మెంటుకు వెళ్తున్నారా? అని నిల‌దీశారు. ఏపీకి సంబంధించిన ఒక్క స‌మ‌స్య‌పైనా.. వారు నోరు విప్ప‌డం లేద‌న్నారు. ఇంద‌కేనా 22 మంది ఎంపీలను ప్ర‌జ‌లు గెలిపించింది? అని నిల‌దీశారు. విశాఖప‌ట్నం ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఆదివారం విశాఖ‌లో భారీ బహిరంగ స‌భ‌ను నిర్వ‌హించిన జ‌న‌సేన‌.. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా తాము అండ‌గా ఉంటామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎంపీల‌ను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు.

వైసీపీకి ఎంపీల మంద‌బలం ఉంద‌ని.. కానీ, వారు జ‌గ‌న్ పూజ‌లో ప‌రిమిత‌మ‌య్యార‌ని..ఆయ‌న‌ను పొగిడేందుకు.. విమ‌ర్శించిన వారికి వ్య‌తిరేకంగా దాడులు చేయించేందుకు వారు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక అన్న ప‌వ‌న్‌.. ఈ విష‌యాన్ని వైసీపీ వ‌దిలేసిందా? అని ప్ర‌శ్నించారు.. ఎంపీలు.. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా దీనిపై పార్ల‌మెంటులో ప్ర‌శ్నించ‌డం లేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్మికులు, నిర్వాసితుల నిరసనలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సంఘీభావం ప్రకటించారు. నాయకుడు, కవి ఎప్పుడూ కార్మికులవైపు నిలబడాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమ నేతలకు అభినందనలు తెలిపారు.

దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యమన్న పవన్ కల్యాణ్.. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదం.. అందరిలో భావోద్వేగం నింపిందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చేందుకు ఎందరో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఉక్కు పరిశ్రమ రావడంలో ఏయూ విద్యార్థుల పాత్ర కూడా ఉందన్న ఆయన.. ఉక్కు ఉద్యమంలో ఆనాడు పోలీసు కాల్పుల్లో 32 మంది చనిపోయారని చెప్పారు. ఎందరో పోరాటం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమ ఇక్కడకు వచ్చిందన్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తి ఎంపీ వీర‌క‌థ‌లు చెప్పార‌ని, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఇక్క‌డ ఒక‌రు పాద‌యాత్ర నిర్వ‌హించార‌ని.. మ‌రి ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతార‌ని నిల‌దీశారు.

‘ఉక్కు పరిశ్రమ నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. భూమి కోల్పోయిన నిర్వాసితులు అనేక కష్టాలు పడుతున్నా రు. ప్రభుత్వరంగ పరిశ్రమలు అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటా. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని అమిత్‌షాను కోరాం. నా వెనుక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ప్రజాబలం ఉందనే నాకు ఎవరైనా అపాయింట్‌మెంట్ ఇస్తారు. అన్నింటికీ ఉన్నట్లే విశాఖ ఉక్కు పరిశ్రమకూ నష్టాలు ఉన్నాయి. వైసీపీ రాజకీయ పరిశ్రమకు తప్ప అన్నింటికీ నష్టాలు ఉన్నాయిస అని ప‌వ‌న్ ఏకేశారు.