వైసీపీ డిమాండ్ లో అర్ధముందా ?

‘రాజ్యాంగబద్దంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ లాంటి అసాంఘీక పార్టీ ఉండకూడదు’ ఇది తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన డిమాండ్. ఎన్నికల్లో టీడీపీ పాల్గొనకుండా బ్యాన్ చేయాలని తాజాగా సహచర ఎంపీలతో కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతోందో ఆధారాలతో సహా ఇచ్చామని విజయసాయి మీడియాతో చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా టీడీపీని అడ్డుకునే అధికారం కమిషన్ కు లేదు.

అలాగే వైసీపీ ఫిర్యాదు చేసింది కదాని ఎన్నికల్లో పాల్గొనకుండా బ్యాన్ చేయటం కూడా సాధ్యం కాదు. అయినా ఇంత చిన్న విషయం వైసీపీ పెద్దలకు తెలీకుండానే ఉంటుందా ? తమ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబునాయడు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి పోటీగా వైసీపీ ఎంపీలు టీడీపీ రద్దు డిమాండ్ తో ఎన్నికల కమిషన్ ను కలిసినట్లు అర్ధమైపోతోంది.

రాష్ట్రపతి పాలన పెట్టాలన్న చంద్రబాబు డిమాండ్ కౌంటర్ గా మాత్రమే టీడీపీని రద్దు చేయాలన్న వైసీపీ నేతల డిమాండు ఉంది . చంద్రబాబు, వైసీపీ నేతల వ్యవహారం ఎలాగుందంటే జరగని పనుల కోసం ఢిల్లీ వేదికలపై ఒకళ్ళ పరువు మరొకళ్ళు తీసుకోవటానికి తప్ప ఇంక దేనికీ పనికిరాదు. 2019 ఎన్నికల్లో టీడీపీని జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే చావుదెబ్బ కొట్టారో అలాగే వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నం చేయాలి.

అలాగే వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టడం ద్వారా మాత్రమే వైసీపీని టీడీపీ మట్టికరిపించాలి. విజయానికి ఎలాంటి షార్ట్ కట్ ఉండదని రెండుపార్టీల అగ్రనేతలు గ్రహించాలి. ఎన్నికల్లో దెబ్బ కొట్టడం ద్వారా కాకుండా తెరవెనుక ప్రయత్నాల ద్వారా దెబ్బ కొట్టేందుకు చేసే ప్రయత్నాలను జనాలు హర్షించరని గ్రహించాలి. ప్రజల్లో అత్యధికులు తమకే మద్దతుగా నిలిచారని వైసీపీ నేతలు చెప్పుకున్నారు. మరదే నిజమైతే టీడీపీ గుర్తు రద్దుకోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారు ?

వచ్చే షెడ్యూల్ ఎన్నికల్లో కూడా ప్రజల మద్దతుతోనే టీడీపీని చిత్తుగా ఓడిస్తే పసుపు పార్టీయే కనుమరగైపోతుంది. తెలంగాణాలో టీడీపీ పరిస్ధితి ఏమిటో ప్రత్యక్షంగా చూస్తు కూడా టీడీపీని బ్యాన్ చేయమని డిమాండ్ చేయటం అర్ధంలేదు. ప్రజామద్దతు కోల్పోయిన ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదని ఇప్పటికే నిరూపితమైంది. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డిపై తాము చేస్తున్న ఆరోపణలు, విమర్శలన్నీ నిజమని నిరూపించాలంటే ప్రజామద్దతు కూడదీసుకోవటం ఒకటే మార్గం. కాబట్టి రెండుపార్టీలు నేల విడిచి సాము చేసేకన్నా ప్రజామద్దతు కోసం క్షేత్రస్ధాయిలో కృషి చేయటమే మంచింది.