నేను కూడా సైబర్ బాదితుడినే… అందుకే వారానికోసారి మొబైల్ ఫోన్ పాస్వర్డ్ మారుస్తుంటానని చెప్పారు హీరో నాగార్జున. కంప్యూటర్ విప్లవం దశ దాటి డిజిటల్, ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో సైబర్ నేరాలు ఊపందుకున్నాయి. సామాన్యుల కంటే ఉన్నతోద్యోగులు, సెలబ్రిటీలే ఎక్కువగా సైబర్ నేరాల ఉచ్చులో పడుతున్నారు. ఈక్రమంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లో జరిగిన సురక్షా కా తిరంగా కార్యక్రమంలో సైబర్ నేరాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన నాగార్జున తన అనుభవాలను పంచుకున్నారు.
ఐదు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి బ్యాంక్ అధికారినంటూ ఫోన్ చేసి మోసం చేసేందుకు ప్రయత్నం చేసాడని తెలిపారు. విదేశాలకు మాదక ద్రావ్యాలను పార్సెల్ చేసినట్లు కొందరు నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. చివరికి నా కుటుంబంలో కొందరిని భయపెట్టి ఆరేడు గంటల పాటు డిజిటల్ అరెస్టు కూడా చేసినట్లు తెలిపారు. 1977లో తాను ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయని, అప్పట్లోనే మాల్ వేర్ హ్యాకింగ్ పై ప్రొఫెసర్లు హెచ్చరించారని చెప్పారు. అప్పటినుంచే ఈ సైబర్ నేరాలు జరుగుతున్నాయని చెప్పారు.
అందుకే తాను వారానికి ఒకసారి మొబైల్ పాస్వర్డ్, నెలకు ఒకసారి వై ఫైవ్ పాస్వర్డ్ మారుస్తుంటానని తెలిపారు. చివరికి మొబైల్ ఫోన్ లో నా ఫోటోలు కూడా షేర్ చేయనని చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతిఒక్కరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అంటే సైబర్ నేరాలకు 50 ఏళ్లకు పైగానే చరిత్ర ఉందని నాగార్జున ప్రసంగాన్ని బట్టి అర్ధం అవుతుంది. ఇప్పుడు ఈ సమస్య తీవ్రత పెరిగింది. బాధితుల సంఖ్య వంద శాతం పెరిగింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు చేసింది. తగినంత సిబ్బంది లేకపోవడంతో నిందితులు సేఫ్ గా తప్పించుకుంటున్నారు. బాధితులు నెలల తరబడి పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా ఒక్క పొరపాటుతో పోగొట్టుకోవడం బాధాకరం. సైబర్ నేరాలపై అవగాహనా పెంపొందించుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం అని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates