గుజరాత్ ను వణికిస్తున్న చండీపుర…. 25 పిల్లలు బలి

గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది. దీనికి కారణం ఏమిటో అర్ధం కాక వైద్య నిపుణులు, పరిశోధకులు తలలు పట్టుకుంటున్నారు.

ఎప్పుడో 1965లో 60 ఏళ్ళ క్రితం మహారాష్ట్రలోని నాగపూర్ పరిసరాల్లోని చండీపుర గ్రామంలో కనుక్కొన్న ఈ వైరస్ ఇప్పుడు గుజరాత్ లో హడలు పుట్టిస్తుంది. కేవలం ఐదు వారాల్లో 25 మంది చిన్నారులు చనిపోవడంతో వైద్యులు ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది జూన్ 30 నుంచి ఈ వైరస్ విరుచుకొని పడుతుంది. 2024 లో కూడా ఈ వైరస్ బారిన పడిన 78 మందిలో 28 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ప్రధానంగా 15 ఏళ్ళ చిన్నారులు, పసిపిల్లల మీద తీవ్రమైన ప్రభావం చూపుతోంది. మెదడు వాపు తరహాలో లక్షణాలతో మెదడు మీద ప్రభావం చూపుతుంది. సాధారణ జ్వరంతో మొదలై విపరీతంగా పెరుగుతుంది. తలనొప్పితో అల్లాడిపోతారు. కొందరికి జ్వరంతో విరేచనాలు కూడా అవుతాయి. నీరసపడిపోతారు. ఈ వైరస్ సోకిన 24 గంటల నుంచి 48 గంటల్లో తీవ్రరూపం దాల్చుతుంది.

కాళ్ళు చేతులు కొట్టుకోవడం, మూర్చ లక్షణాలు కనపడతాయి. ఇసుక ఈగలు, దోమల ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే వేల సంఖ్యలో ఈ ఈగలను సేకరించి పరీక్షించినప్పటికీ వైరస్ ఆనవాళ్లు కనిపించక పోవడం వైద్యులకు అంతుబట్టడం లేదు. ఈ వైరస్ ను మోసుకొని వెళ్లే దోమల్లోనూ ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. పశువుల పాలు, రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రస్తుతం ఈ వైరస్ గుజరాత్ లోని 12 జిల్లాల్లో, రాజస్థాన్ లోని 3జిల్లాల్లో ప్రభావం చూపుతోంది. ఇక్కడికే పరిమితం అవుతుందో లేకపోతే క్రమంగా దేశం మొత్తం విస్తరిస్తుందో అర్ధం కాక వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ కారక వ్యాధి కావడంతో నిముషాల్లో వ్యాపించే అవకాశం వుందని చెబుతున్నారు. ఈ వైరస్ కు నిర్ధిష్టమైన ఔషాధాలు లేవు. లక్షణాలను బట్టి చికిత్స చేస్తున్నారు. ఇసుక ఈగలు, దోమలు కుట్టకుండా పిల్లలకు ఫుల్ హ్యాండ్ దుస్తులు, కాళ్లకు సాక్సులు తొడిగించాలని, దోమతెరలు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.