ఏపీలోని నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకం వల్ల కోట్లాది మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు, గృహిణులు…ఇలా ఏడాది కాలంగా అన్ని వర్గాల మహిళల అభిమానాన్ని ఈ పథకం చూరగొంది. అంతేకాదు మహిళలను ఎన్డీఏకు చేరువ చేస్తున్న ఫ్రీ బస్సు పథకం పట్ల ప్రభుత్వం కూడా సంతృప్తిగా ఉంది.
అయితే, ఈ పథకం ప్రారంభమైన కొత్తలో ఆటో డ్రైవర్ల నుంచి కాస్త వ్యతిరేకత వ్యక్తమైంది. తమ రోజువారీ సంపాదనను ఈ పథకం గణనీయంగా ప్రభావితం చేసిందని వారు వాపోయారు. అయితే, అర్హత గల ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం వల్ల వారిలో వ్యతిరేకత తగ్గింది.
ఉచిత బస్సు ప్రయాణం వల్ల భారీ సంఖ్యలో మహిళలకు చాలా ప్రయోజనం కలిగింది. ఎన్డీఏకు మహిళా ఓటర్లతో సానుకూల సంబంధం ఏర్పరచడంలో ఈ పథకం ఎంతగానో సహాయపడింది. అయితే, నిత్యం బస్సుల్లో ప్రయాణించే కొందరు పురుషులు ఈ పథకం వల్ల కాస్త ఇబ్బంది పడడం మినహా వారి నుంచి కూడా పెద్ద వ్యతిరేకత రాలేదు.
ఈ పథకంతో పాటు మరిన్ని పథకాల అమలు వల్ల మహిళల్లో ఎన్డీఏ పట్ల ఆదరణ పెరుగుతోంది. భవిష్యత్ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఈ పథకం గణనీయంగా ప్రభావితం చేయగలదు. ఓవరాల్ గా ఏడాదిగా అమలవుతున్న ఈ పథకం సూపర్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇక, ఈ పథకానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రచారం చేసినప్పటికీ అది వర్కవుట్ కాలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates