డ్రాగన్ సైన్యంపై త్రిశూలం

India-China

చైనా-భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ సైన్యం చేస్తున్న కంపు అంతా ఇంతా కాదు. ప్రతిరోజు ఏదో కారణంగా మన భూభాగంలోకి చొచ్చుకు రావడం మన సైన్యం తో గొడవ పడటం మామూలైపోయింది. కొన్నిసార్లు ఈ గొడవలు శృతిమించి ముష్టిఘాతాలు, ముళ్ళ కర్రలతో కొట్టుకోవడం వరకు వెళిపోతోంది. ఆమధ్య గాల్వాన్ లోయలో జరిగిన ఇలాంటి ఘటనలోనే రెండువైపుల సైనికులు చనిపోయిన విషయం మనదేశంలో సంచలనంగా మారింది.

గాల్వాన్ లోయలోకి చైనా సైనికులు కావాలనే మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి మన సైన్యం తో గొడవలు పెట్టుకున్నారు. మన సైన్యం ఊహించని విధంగా ముళ్ళ కర్రలతో మన వాళ్ళపై డ్రాగన్ సైన్యం విరుచుకుపడింది. ముందు షాక్ కు గురైనా వెంటనే మన వాళ్ళు తేరుకుని ఎదురు దాడులు చేశారు. ఆ సమయంలో రెండువైపులా జరిగిన గొడవలో మన సైనికులు సుమారు 20 మంది చనిపోయారు. అలాగే చైనా సైనికులు కూడా 45 మంది చనిపోయినట్లు ప్రచారం జరిగింది.

సో, అప్పుడు జరిగిన గొడవలు తదనంతర పరిణామాలను దృష్టిలో పెట్టుకునే మన రక్షణరంగ శాస్త్రవేత్తలు శత్రువులపై ప్రయోగించేందుకు వీలుగా సరికొత్త తేలికరకమైన ఆయుధాలను తయారు చేశారు. మొత్తం ఐదు రకాల ఆయుధాలను సరిహద్దుల్లో కాపలా కాసే సైన్యానికి అందించారు. వీటిలో త్రిశూల్, వజ్ర, శాపర్ పంచ్, దండ్, భద్ర ఉన్నాయి. వీటిలో త్రిశూల్ తో పాటు మిగిలిన నాలుగు కూడా కరెంటుతో పనిచేస్తాయి.

శతృవులను వీటిని తాకించగానే కరెంటు షాక్ కొడుతుంది. దాంతో శతృవులు ఒక్కసారిగా షాక్ కు గురై కొద్దిసేపు స్పృహతప్పి పడిపోతారు. కొత్తగా తయారు చేసిన ఆయుధాల్లో దండ్ అనే గ్లోవ్ లాంటిది కూడా ఉంది. ఈ గ్లోవ్ తో ప్రత్యర్ధులను ఒక్కటిచ్చుకుంటే కరెంటు షాకుతో పడిపోతారు. మళ్ళీ వాళ్ళకు స్పృహ వచ్చేలోగా మన సైన్యం తమ పని కానిచ్చేసుకోవచ్చు. అలాగే భద్ర అనే కవచాన్ని కూడా తయారుచేశారు. ఇది శత్రువులపై కరెంటు కాంతిని ప్రసరిస్తుంది. దీంతో శతృవుల కళ్ళు కొద్దిసేపు కనబడటం మానేస్తాయి.

పై ఆయుధాలన్నీ కూడా కేవలం బ్యాటరీ సాయంతో పనిచేస్తాయి. ఒకసారి బ్యాటరీని ఫుల్ గా చార్జ్ చేస్తే 8 గంటలు పని చేస్తాయి. సరిహద్దుల్లోని మైనస్ డిగ్రీల చలిలో కాపలా కాస్తున్న సైన్యానికి బ్యాటరీతో పనిచేసే ఆయుధాలు చాలా ఉపయోగంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాకపోతే రోజుల తరబడి సరిహద్దుల్లో కాపలాకాసే సైన్యానికి నిరంతరంగా బ్యాటరీ చార్జింగ్ చేసే అవకాశాలుండాలి. అంతా బాగానే ఉంది కానీ మన దగ్గర ఎలాంటి ఆయుధాలున్నాయో శతృవులకు తెలిసిపోయినపుడు దానికి తగ్గట్లుగా వాళ్ళు కూడా రెడీ అవ్వరా ? అన్నదే అసలైన సందేహం.