టీడీపీకి గంటా గుడ్ బై.. పక్కా ప్లానింగ్ తో ?


ఏపీలోని రాజకీయ నేతల్లో చాలామంది అయితే రాజకీయ పార్టీతో వారి పేరు ముడిపడి ఉంటుంది. వ్యక్తిగతంగా వారికున్న బలం ఏమిటన్నది అంత స్పష్టంగా కనిపించదు. కానీ.. గంటా శ్రీనివాసరావు మాత్రం అందుకు భిన్నంగా. ఆయనకు పార్టీ ఏదైనా.. ఆయన గెలుపు మాత్రం ఖాయమని చెబుతారు. ఇప్పటివరకు ఆయన రాజకీయ ప్రయాణాన్ని చూస్తే.. కాంగ్రెస్.. ప్రజారాజ్యం.. తెలుగుదేశం.. ఇలా ఏ పార్టీలో చేరినా.. ఆయన వరకు ఆయన ఎన్నికల్లో గెలుపు మాత్రం ఖాయమన్నట్లుగా ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అధికారటీడీపీ దారుణ ఓటమి పాలైనప్పటికీ.. గంటా మాత్రంచాలా సులువుగా విజయం సాధించటం తెలిసిందే.

గంటాకు ఉన్న మరో బలహీనత.. ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడికి ఆయన వెళతారని. కాకుంటే.. జగన్ విషయంలో ఆయన లెక్కలు కాస్త ఫెయిల్ అయ్యాయి. జగన్ సీఎం అయ్యాక.. వైసీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేసినా.. అప్పటికే వైసీపీ ఫుల్లీ లోడెడ్ అన్నట్లుగా మారటం.. గంటా ట్రాక్ రికార్డు గురించి తెలిసి.. ఆయన్ను తీసుకురావటం ద్వారా పార్టీకి వచ్చే ప్రయోజనం కంటే కూడా.. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందన్న భావనతోనే ఆయన్ను పార్టీలో చేర్చుకోవటానికి ఇష్టపడలేదని చెబుతారు.

జగన్ విషయంలో తన ప్రయత్నాలు ఫెయిల్ కావటంతో గంటా వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించినట్లు చెబుతారు. తెలుగుదేశం సైతం.. గంటా మైండ్ సెట్ అర్థమై.. ఆయన మీద పెద్దఆశలు పెట్టుకోకుండా.. తమ ప్రయత్నాలు తాము చేసుకుంటూ పోతోంది. విశాఖ ఉక్కు ఎపిసోడ్ లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా.. ఇప్పుడాయన రాజీనామా పత్రం స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది. అంటే.. ఇప్పట్లో ఆయన మాజీ అయ్యే అవకాశం లేదు.. ఉప ఎన్నికకు అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీకి సైతం ఆయన గుడ్ బై చెబుతూ.. రాజీనామాను పంపేశారు. దీంతో.. గంటా తదుపరి అడుగులు ఎటువైపు అన్నది ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన జనసేనలోకి ఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు. ప్రజల్లో పవన్ కు ఛరిష్మా ఉన్నప్పటికీ.. పార్టీ పరంగా ఎన్నికల్లో విజయం సాధించేంత సీన్ లేని వేళ.. గంటా లాంటి రాజకీయ నేతల్ని పార్టీలోకి తీసుకురావటం ద్వారా.. గెలుపు ఫార్ములాను తాము డీకోడ్ చేయాలన్న పట్టుదలతో జనసేన ఉందని చెబుతారు.

దీనికి తోడు.. తాను జనసేనలోకి వెళ్లటం ద్వారా.. సామాజిక సమీకరణాలకు సాయం చేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. తాను జనసేనలోకి రావాలంటే.. 2024 ఎన్నికల వేళకు టీడీపీతో జత కట్టాలన్న కండీషన్ పెట్టినట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే.. ఎన్నికల్లో విజయం మాత్రమే కాదు.. మంత్రి పదవి ఖాయమన్న ఆలోచనలో గంటా ఉన్నట్లు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు తనకు సానుకూలంగా ఉండే చోటు నుంచి పోటీ చేసి విజయం సాధించే గంటాకు తగ్గట్లే.. తాను కోరుకున్న స్థానాన్ని జనసేన అయితే ఈజీగా ఇచ్చేస్తుందన్న ఆలోచనతో పవన్ పార్టీలో చేరేందుకు గంటా డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. మరి.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడో చూడాలి.