జ‌గ‌న్ ప‌ట్ల‌ మోహ‌న్ బాబు అసంతృప్తి?

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు రాజకీయాలతో కూడా గొప్ప బంధమే ఉంది. ఆయన తెలుగుదేశం, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్.. ఇలా పలు పార్టీల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పని చేశారు. చివరగా ఆయన వైకాపాకు మద్దతు ఇవ్వడం తెలిసిందే. 2019 ఎన్నికల ముంగిట జగన్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. అంతే కాక గత తెలుగుదేశం ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు సర్కారు ఉద్దేశపూర్వకంగా తన కాలేజీకి ఫీజ్ రీఎంబర్స్‌‌మెంట్ బకాయిలు ఇవ్వట్లేదని రోడ్డెక్కి నిరసన కూడా తెలిపారు.

ఇంతా చేశాక జగన్ ముఖ్యమంత్రి అయినా మోహన్ బాబు బాధ తీరలేదన్నది గట్టిగా జరుగుతున్న ప్రచారం. ఫీజు రీఎంబర్స్‌మెంట్ విషయంలో మోహన్ బాబు కాలేజీకి ఇబ్బందులు తప్పట్లేదు. అలాగే ఆయన టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డారన్న అభిప్రాయాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ పదవిని తన దగ్గరి బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డికి జగన్ కట్టబెట్టిన సంగతి తెలిసిందే.

ఈ రెండు విషయాలపై తాజాగా ఏబీఎన్ రాధాకృష్ణ షో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో మోహన్ బాబు ఆసక్తికర రీతిలో స్పందించారు. తన కాలేజీ ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇబ్బందులు కొనసాగుతున్నట్లు అంగీకరించిన మోహన్ బాబు.. మరోసారి ఇందులో జగన్ తప్పేమీ లేదన్నట్లుగా, తప్పంతా అధికారులదే అన్నట్లు మాట్లాడారు. “ముఖ్యమంత్రిని కొందరు ఐఏఎస్‌‌లు అడ్డదారి పట్టిస్తున్నారు. విద్యా సంస్థల విషయంలో కొంతమంది ఐఏఎస్‌లు రాంగ్ డైరెక్షన్ ఇవ్వడం వల్ల హైయ్యర్ ఎడ్యుకేషన్ దెబ్బ తిన్న మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డికి నాకు పర్సనల్‌గా ఏమీ లేదు. కాలేజీల వ్యవహారంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అది తప్పని చెప్పాం” అని మోహన్ బాబు అన్నారు.

ఇక టీటీడీ ఛైర్మన్ పదవి దక్కకపోవడంపై మోహన్ బాబు స్పందిస్తూ.. “నాకు చంద్రబాబు బంధువే, జగనూ బంధువే. చంద్రబాబుకు ప్రచారం చేశాం. అప్పుడు ఏం అడగలేదు. ఈయనకూ ఒకసారి సపోర్ట్ చేద్దాం అని హృదయపూర్వకంగా చేశాం. నేను ఏదీ ఆశించి చేయలేదు. ‘అది పోయింది’ అన్నారు. ఎక్కడికి పోయిందది? వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకున్నారు. అది వాళ్లిష్టం. ముఖ్యమంత్రి ఇష్టం” అంటూ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా జగన్ పట్ల పరోక్షంగా తన అసంతృప్తిని బయటపెట్టేశారు మోహన్ బాబు.