ఇండస్ట్రీకి పవన్ ఓ గుదిబండ..సజ్జల

ఏపీ సీఎం జగన్, వైసీపీ మంత్రులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ వర్సెస్ వైసీపీ నేతల వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే పవన్ ను మంత్రులు పేర్ని నాని, కన్నబాబులు విమర్శించగా….తాజాగా పవన్ పై వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. పవన్‌ వ్యాఖ్యలను సినీ పరిశ్రమలొని పెద్దలే వ్యతిరేకిస్తున్నారని, అంతేకాదు, ఆయన పెద్ద గుదిబండగా మారారని వారు భావిస్తున్నారని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమాలు, రాజకీయాలు..ఇలా రెండు గుర్రాలపై పవన్ స్వారీ చేస్తున్నారని, తన స్వార్థం కోసమే ప్రభుత్వంపై పవన్ బురద చల్లుతున్నారని సజ్జల మండిపడ్డారు. కానీ, ఆ బురద ఆయనపైనే పడిందని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబులా నలుగురు సినీ పెద్దలను పిలిపించి ఫొటోలకు ఫోజులిచ్చి జాతీయ మీడియాలో హైలెట్‌ అయ్యేలా షో చేయడం జగన్ కు రాదని అన్నారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానంపై ఏ రకమైన అనుమానాలున్నా సినీ పెద్దలు ముఖ్యమంత్రిని కలవొచ్చని సజ్జల అన్నారు.

తక్కువ ఖర్చులో ప్రజలకు సినిమా వినోదాన్ని అందించడమే తమ విధానమని, టికెట్ల బుకింగ్ పారదర్శకంగా ఉండాలనుకునే వారంతా ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తారని, దోపిడీదారులు తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని అన్నారు. సినిమా విడుదలైన మొదటి వారంలో రూ.వంద టికెట్‌ను రూ.వెయ్యికి అమ్ముకుని.. అటు ప్రజలను ఇటు ప్రభుత్వాన్ని దోపిడీ చేస్తున్నవారే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానంపై అపోహలు సృష్టిస్తున్నారని సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్‌ నుంచి కాంతారావు, రాజబాబు వరకూ ఏ సినిమాకైనా టికెట్‌ ధర ఒకేలా ఉండేదని, ఇపుడు అలా లేదని అన్నారు. సినిమాకు ఏ రోజు వచ్చిన కలెక్షన్‌లో వాటాలు ఆ రోజే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, థియేటర్‌ యజమానుల ఖాతాల్లో ఆటోమేటిక్‌గా జమ అవుతాయని, ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌ పాత్ర మాత్రమే పోషిస్తుందని సజ్జల వెల్లడించారు. తొలివారంలోనే బాహుబలి సినిమాకు థియేటర్లు నిండలేదని చెప్పి లెక్కలు కూడా చూపకుండా మోసం చేశారని, దీనివల్ల కష్టపడి సినిమా తీసిన నిర్మాతలు నష్టపోతున్నారని చెప్పారు.

ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతోందని, ఈ అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని తెస్తున్నామని అన్నారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానంపై సినీ పరిశ్రమలోని అందరూ హర్షిస్తున్నారని తెలిపారు. ఈ విధానాన్ని అమలుచేయడానికి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని, కొందరు దోపిడీ దారులు తమ స్వార్థం కోసం ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.