గడ్కరి టార్గెట్ చేసింది మోడీనేనా ?

బీజేపీతో పాటు నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మెల్లి మెల్లిగా పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు అంటే మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నపుడు పార్టీ లేదా ప్రభుత్వంపై బహిరంగంగా మాట్లాడాలంటేనే అందరు వణికిపోయేవారు. అలాంటాది మోడి విధానాలపైన, నిర్ణయాలతో పాటు పార్టీలోని అసంతృప్తులు కూడా కొందరు బహిరంగంగానే మాట్లాడేస్ధాయికి చేరుకుంటున్నారు. మోడి అనుసరిస్తున్న విధానాలపై ఆ మధ్య షాట్ గన్ గా పాపులరైన శతృజ్ఞ సిన్హా బహిరంగంగానే ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సిన్హా పార్టీకి రాజీనామా చేసేశారు. ఆ తర్వాత సీనియర్ లీడర్లు యశ్వంత్ సిన్హా లాంటి మరికొందరు కూడా మోడీపై బహిరంగంగానే విమర్శలు చేసి పార్టీలో నుండి వెళ్ళిపోయారు. ఇపుడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వంతు వచ్చింది. గడ్కరీ డైరెక్టుగా మోడీని కానీ బీజేపీని కానీ ఏమి అనలేదు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సూటిగా మోడికే తగులుతాయనటంలో ఎలాంటి సందేహంలేదు.

రాజస్ధాన్లోని జైపూర్ లో జరిగిన ఓ సమావేశంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంఎల్ఏలు, మంత్రులు, సీఎంలు ఎవరు కూడా సంతోషంగా లేరని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మంత్రులవ్వలేని ఎంఎల్ఏలు నిత్య అసంతృప్తితో ఉన్నారట. మంత్రులైన వారిలో చాలామంది తమకు ప్రాధానమైన శాఖలు ఇవ్వలేదనే మండిపోతున్నారట. ఇక సీఎంలకు తమను ఎప్పుడు తప్పిస్తారో అనే ఆందోళన పెరిగిపోతోందని గడ్కరీ వివరించారు.

గడ్కరీ చేసిన తాజా వ్యాఖ్యలు నేరుగా మోడీకి తగులుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే గడచిన ఆరు నెలల్లో బీజేపీకి చెందిన ఆరుగురు సీఎంలు మారారు. ఉత్తరాఖండ్ లో ఇద్దరు సీఎంలు, కర్ణాటక, గుజరాత్ లో ఒక్కో సీఎం మారారు. వీరితో పాటు మంత్రుల్లో చాలామందిని మోడీ మార్చేశారు. కర్నాటక మంత్రుల్లో తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తిని బహిరంగంగానే మీడియాతో చెప్పేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇదే సమయంలో తొందరలోనే హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ ను కూడా మార్చేస్తారనే ప్రచారం జోరందుకుంటోంది. ఎందుకంటే సీఎం ఢిల్లీలోనే మూడు రోజులుగా మకాం వేసున్నారు. సీఎం ఢిల్లీలో ఉండగానే కొందరు మంత్రులు, సీనియర్ ఎంఎల్ఏలతో పార్టీ, ప్రభుత్వంలోని ముఖ్యులు సమావేశమవుతున్నారట. దీంతో సీఎంగా ఠాకూర్ ను మార్చేయడం ఖాయమంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.