మ‌ళ్లీ అదే డిమాండ్‌.. రాహుల్ గాంధీ ఈ సారైనా!

మోడీ ప్ర‌భ‌తో 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లు మొద‌లు కేంద్రంలో అధికారం కోల్పోయి రాష్ట్రాల్లో ప‌ట్టు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ ద‌య‌నీయంగా మారుతోంది. ఆ పార్టీని స‌మ‌ర్థంగా న‌డిపించే నాయ‌కుడే లేడు. ఇప్ప‌టికీ ఆ పార్టీకి అధ్య‌క్షుడూ లేడు. కానీ తాజాగా మ‌రోసారి రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష‌డిని చేయాల‌నే డిమాండ్ వినిపిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శించ‌డంలో ప‌దును పెంచడంతో పాటు పార్ల‌మెంట్‌లో విప‌క్షాల‌ను ఏకం చేయ‌డంలోనూ కాంగ్రెస్ నాయ‌కుడిగా రాహుల్ గాంధీ త‌న దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో ఆయ‌న‌ను తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా చేయాల‌ని ఇండియ‌న్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) ప్ర‌తిపాద‌న‌ను తెరపైకి తీసుకు వ‌చ్చింది. గోవాలో జ‌రిగిన ఐవైసీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ల స‌మావేశంలో ఈ మేర‌కు తీర్మానాన్ని ఆమోదించింది.

2004లో ఆక్టివ్ రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన రాహుల్ అదే ఏడాది లోక్‌స‌భ ఎన్నికల్లో గెలిచారు. 2007లో అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీకి జ‌న‌ల‌ర్ సెక్ర‌ట‌రీగా నియ‌మితుల‌య్యారు. 2013లో పార్టీ ఉపాధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2017లో అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టారు. కానీ 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం అనంత‌రం అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు. అలా చేయ‌వ‌ద్ద‌ని సీనియ‌ర్ నేత‌లు కోరినా ఆయ‌న విన‌లేదు. అప్ప‌టి నుంచి పార్టీకి జాతీయ అధ్య‌క్షుడే లేకుండా పోయారు. ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తాత్కాలికంగా ఆ బాధ్య‌త‌లు చూసుకుంటున్నారు. మ‌రోవైపు రాహుల్ గాంధీ అధ్య‌క్ష హోదాలో లేన‌ప్ప‌టికీ పార్టీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ద‌గ్గ‌ర నుంచి పీసీసీ ప‌ద‌వులు ఎవ‌రికి క‌ట్ట‌బెట్టాల‌న్న విష‌యం వ‌ర‌కూ అన్నింట్లోనూ రాహుల్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

2020 ఫిబ్ర‌వ‌రిలో రాహుల్‌ను మ‌ళ్లీ అధ్య‌క్షుణ్ని చేసే ప్ర‌యత్నాలు మొద‌లైన‌ట్లు స‌మాచారం. కేర‌ళ నుంచి రాజ‌స్తాన్ వ‌ర‌కు త‌ల‌పెట్టిన జ‌న్ ఆక్రోశ్ ర్యాలీలో భాగంగా ఆయ‌న‌ను అధ్య‌క్షుణ్ని చేయాల‌ని పార్టీ భావించింద‌ని కానీ క‌రోనా కార‌ణంగా అది కార్య‌రూపం దాల్చ‌లేదని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా యూత్ కాంగ్రెస్ ప్ర‌తిపాద‌న‌తో ఆ దిశ‌గా అడుగులు ప‌డే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. కానీ 2019 ఎన్నిక‌ల త‌ర్వాత వ‌రుస‌గా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ పరాజ‌యం పాలవుతూ వ‌స్తోంది. ఈ నేపథ్యంలో మ‌రోసారి అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు రాహుల్ సిద్ధంగా లేరనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినా పార్టీ కోసం ప‌ని చేయాలంటే అధ్య‌క్షుడే అయి ఉండాల‌ని లేద‌ని రాహుల్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ఆయ‌న ముందుకు రాక‌పోవ‌డంతోనే ఇప్ప‌టికే అధ్య‌క్ష ఎన్నిక‌లు రెండు సార్లు వాయిదా ప‌డ్డాయి.

వ‌చ్చే ఏడాది అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో రాహుల్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకునేందుకు సిద్ధంగా లేర‌ని తెలుస్తోంది. ఒక‌వేళ ఆయ‌న అధ్య‌క్షుడిగా ఎంపికైతే త‌న ప‌క్క‌న యువ జ‌ట్టు ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. కానీ ప్ర‌స్తుతం పార్టీలో ప్ర‌భావ‌వంత‌మైన యువ నాయ‌కుల సంఖ్య త‌క్కువే. ఈ ప‌రిస్థితుల్లో వ‌చ్చే ఏడాది అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత‌నే అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టాలా? వ‌ద్దా? అనే విష‌యంపై రాహుల్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చే వీలుంద‌ని రాజ‌కీయ నిపుణులు చెప్తున్నారు.