నెల్లూరులో వైసీపీ సీన్ రివ‌ర్స్‌… ఈ మూడు సీట్లు గోవిందా ?

ఏపీలో అధికార వైసిపి కంచుకోటలో ఒకటి అయిన నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలతో పాటు నెల్లూరు ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చినా జిల్లాలో నెల్లూరు ఎంపీ సీటుతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీపాగా వేసింది.

నాడు టీడీపీ అధికారంలోకి వచ్చినా మూడు సీట్లతో సరిపెట్టుకుంది. టిడిపి గత ఎన్నికల్లో టీడీపీ జిల్లాలో ఒక్క సీటులో కూడా బోణీ కొట్టలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది. మరో మూడు నెలల్లో సగం పాల‌న‌ కూడా పూర్తి కానుంది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ ప్రక్షాళన చేస్తానని సంకేతాలు ఇస్తున్నారు.

ఈ సమయంలో ఈ రెండు ఏళ్ళ పాలనలో నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు ఎలా ఉందన్న దానిపై జరిగిన ఒక సర్వేలో అధికార పార్టీకి ఎమ్మెల్యేల‌కు వ్యతిరేకంగా గాలులు ఉన్నట్లు వెల్లడైంది. గత ఎన్నికల్లో జగన్ బొమ్మ చూసి జిల్లా ఓటర్లు వన్ సైడ్ గా అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించారు. అయితే రెండేళ్లు గడిచేసరికి కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇసుక‌, ఇళ్ల దందాలు, భూక‌బ్జాలు, అవినీతి విష‌యాల్లో కొంద‌రిపై ప్ర‌జలు విసుగెత్తిపోయి ఉన్నార‌ట‌.

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు మిన‌హా జిల్లా ప్ర‌జ‌ల‌కు కొత్త‌గా ఒరిగిందేమి లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. ఈ క్ర‌మంలోనే గూడూరు, కావలి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంద‌ని స‌ర్వే చెప్పింది. ఇక గూడురులో అయితే తిరుప‌తి మాజీ ఎంపీ, ఇప్ప‌టి ఎమ్మెల్యే వెల‌గ‌ల‌ప‌ల్లి వ‌ర‌ప్ర‌సాద్ తీరుపై రెడ్డి సామాజిక వ‌ర్గం ర‌గులుతోంది. ఇక్క‌డ గ‌తంలో గెలిచిన పాశం సునీల్ కూమార్ చాలా బెట‌ర్ అని.. ఇప్పుడు టీడీపీలో ఉన్న సునీల్‌నే తిరిగి వైసీపీలోకి తీసుకువ‌చ్చి టిక్కెట్ ఇప్పించుకోవాల‌ని ఆ నేత‌లు చూస్తున్నారు. వ‌ర‌ప్ర‌సాద్ వ్య‌వ‌హార శైలీపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో కూడా తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇక కావలిలో వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డిపై ఇప్పుడు వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఆయ‌న కొన్ని వ‌ర్గాల‌ను దూరం పెట్ట‌డంతో పాటు వైసీపీ కీల‌క నేత‌లుగా ఉన్న వారిని కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌డానికి కూడా వీళ్లేద‌ని హుకూం జారీ చేయ‌డంతో పార్టీలోనే కొన్ని వ‌ర్గాలు ఆయ‌న‌కు దూర‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు బీద మ‌స్తాన్‌రావు పార్టీలోకి రావడంతో కొన్ని వ‌ర్గాలు ఆయ‌న‌కు దూరం జ‌రుగుతున్నాయి.

ఇక ఆత్మ‌కూరులోనూ వ‌రుస‌గా రెండు సార్లు గెలిచి మంత్రిగా ఉన్న మేక‌పాటి గౌతంరెడ్డిపై ఇత‌ర ఆరోప‌ణ‌లు లేక‌పోయినా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉండ‌డం.. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిలో మంత్రిగా త‌న మార్కు చూపించ‌క‌పోవ‌డంతో అక్క‌డ కూడా పార్టీపై అసంతృప్తి ఉంద‌ని అంటున్నారు. ఇక వెంక‌ట‌గిరి లాంటి చోట్ల కూడా ఇప్పుడు పార్టీపై వ్య‌తిరేక‌త ఉంది. మ‌రి దీనిని టీడీపీ ఎంత వ‌ర‌కు క్యాష్ చేసుకుంటుందో ? చూడాలి.