ఈ టీడీపీ మ‌హిళా నేత‌కు ఎమ్మెల్యే టిక్కెట్ కావాల‌ట‌…!


ఈ ప్రపంచంలో ఏ రంగం అయినా వారసత్వం అనేది కామన్ అయిపోయింది. సినిమారంగంలో స్టార్ హీరోగా ఉన్న వాళ్లు తమ వారసులను పరిచయం చేస్తున్నారు. రాజకీయాల్లో వార‌సుల‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకే కుటుంబానికి చెందిన నాలుగైదు తరాల నేతలు రాజ్యాలను ఏలేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ రాజకీయ వార‌సురాలు అసెంబ్లీ గడప తొక్కాలన్న కోరిక‌తో ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు బెజవాడ టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచిన శ్వేత టిడిపి నుంచి మేయర్ అభ్యర్థిగా ఉన్నారు.

అయితే కార్పొరేష‌న్లో మెజార్టీ డివిజన్లు వైసీపీ గెలుచుకోవడంతో మేయర్ అవ్వాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. అయితే కేశినేని నాని తన కుమార్తె కోసమే బెజవాడ పశ్చిమ నియోజకవర్గం పై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోని ఎంపీకి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న – షేక్ నాగుల్ మీరా – మాజీ ఎమ్మెల్యే బోండా ఉమతో స్థానిక సంస్థల ఎన్నిక‌ల వేళ‌ పెద్ద యుద్ధం నడిచింది. చివ‌ర‌కు అధిష్టానం జోక్యం చేసుకున్నా కూడా ఈ నేత‌ల మ‌ధ్య గ్యాప్ అయితే అలాగే ఉంది. ప్ర‌స్తుతం శ్వేత త‌న తండ్రి ఎంపీగా ఉన్న పార్ల‌మెంటు ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్నారు.

ఇక ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచే ఆమె కార్పొరేట‌ర్‌గా ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంపై నాని హ‌వా ఎక్కువ అవుతోన్నందునే బుద్ధా వెంక‌న్న‌కు, బోండా ఇత‌ర టీడీపీ నేత‌ల‌కు మండిపోయింది. అందుకే వారు నానిపై బ‌ర్ట‌స్ట్ అయ్యారు. వ‌చ్చే ఎన్నికల్లో నాని త‌న కుమార్తెను ఇక్క‌డ నుంచి పోటీ చేయించాల‌న్న ప్లాన్‌తో ఉన్నారు. అయితే న‌గ‌రంలో ఉన్న స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాన్ని క‌మ్మ వ‌ర్గం వాళ్ల‌కు ఇచ్చే అవ‌కాశాలు లేవు. అయితే నాని మాత్రం త‌న ప్ర‌య‌త్నాలు ఆప‌డం లేదు. లేనిప‌క్షంలో తాను త‌ప్పుకుని త‌న కుమార్తెకు ఎంపీ సీటు అయినా ఇప్పించుకోవ‌డ‌మే నాని మ‌రో టార్గెట్ అంటున్నారు. మ‌రి 2024 లెక్క‌లు ఎలా ఉంటాయో ? చూడాలి.