మోడి సర్కార్ పై అవినీతికి పాల్పడిందా ?

తమది మచ్చలేని ప్రభుత్వమని, అవినీతి మకిలి అంటని ప్రభుత్వమని గడచిన ఏడేళ్ళుగా చెప్పుకుంటున్న నరేంద్రమోడి సర్కార్ పైన కూడా అవిని ముద్రపడిందా ? అవుననే అర్దమవుతోంది తాజాగా వెల్లడైన అంశాలతో. ఇంతకీ విషయం ఏమిటంటే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఫ్రాన్స్ లో దర్యాప్తు మొదలైంది.

ఫ్రాన్స్ లో ప్రముఖ మీడియా ‘మీడియాపార్ట్’ కథనం ప్రకారం భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు రు. 59 వేల కోట్లలో భారీ అవినీతి జరిగింది. అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేయటానికి ఫ్రాన్స్ ప్రభుత్వం ఓ న్యాయమూర్తిని కూడా నియమించిందట. అంతే కాకుండా ఫ్రాన్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ చెందిన ఫైనాన్షియల్ క్రైమ్స్ విభాగం కూడా దర్యాప్తు మొదలుపెట్టినట్లు మీడియాపార్ట్ కథనాన్ని ప్రచురించింది.

యుద్ధ విమానాల కొనుగోలులో చాలామందికి పెద్ద ఎత్తున ముడుపులు అందినట్లు తన కథనాల్లో సదరు మీడియాపార్ట్ చెప్పింది. చాలామందంటే అటు ఫ్రాన్స్ తో పాటు భారత్ లో కూడా అనే అర్ధం. భారత్ లో కూడా రఫేల్ కేంద్రంగా అవినీతి జరిగిందనటానికి సాక్ష్యం ఏమిటంటే డిఫెన్స్ వ్యవహారాల్లో ఎలాంటి అనుభవం లేని అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ ఎంపికవ్వటమే. ఈ రిలయన్స్ డిఫెన్స్ ను కూడా ఒప్పందానికి కొద్దిరోజుల ముందే రిజిస్టర్ చేశారు.

2016లో భారత్-ఫ్రాన్స్ మధ్య 36 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం జరిగింది. దీని విలువ సుమారు రు. 59 వేల కోట్లు. ఇపుడు మీడియాపార్ట్ బయటపెట్టిన విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎప్పుడో బయటపెట్టారు. అయితే అప్పట్లో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు కొట్టిపారేశారు. మరిపుడు ఇదే విషయమై ఫ్రాన్స్ దర్యాప్తు మొదలైంది.

ముడుపులు ఇచ్చిపుచ్చుకోవటాలపై ఫ్రాన్స్ లో విచారణ మొదలైందంటే భారత్ లో కూడా అవినీతి జరిగిందనే అర్ధమవుతోంది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాల్లో ఒక దేశంలోనే అవినీతి అంతా జరిగిందని చెప్పటం విడ్డూరమే. మరి ఫ్రాన్స్ లో మొదలైన దర్యాప్తులో భారత్ కు సంబంధించిన ఎవరెవరి పాత్ర ఎంతో తేలిపోతుంది. కాబట్టి ఫ్రాన్స్ లో మొదలైన దర్యాప్తు తొందరగా పూర్తవ్వాలని కోరుకుందాం.