మమతకు షాక్ తప్పదా ?

క్షేత్రస్ధాయిలో జరగుతున్న పరిణామాల కారణంగా చాలామందిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపేమో పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ తో సుప్రింకోర్టులో దాఖలైన కేసుపై విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో బెంగాల్లో గొడవలు జరిగాయని, చాలామంది ఆస్తులను, ప్రాణాలను కోల్పోయారని, అత్యాచారాలు కూడా జరిగినట్లు హైకోర్టు నిర్ధారించింది.

సో జరుగుతున్నదంతా చూస్తుంటే ఎప్పుడో రోజు మమత బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టేస్తారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ జరిగిందేమిటంటే మొన్నటి ఎన్నికల్లో బీజేపీని చిత్తుచేసి మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చిన మరుసటిరోజు నుండి ఓ రెండు రోజుల పాటు బాగా గొడవలు జరిగాయి.

తమపార్టీ నేతలు, కార్యకర్తలనే టార్గెట్ చేసుకుని తృణమూల్ నేతృత్వంలోని గూండాలు రెచ్చిపోయారంటే బీజేపీ ఆరోపణలు మొదలుపెట్టింది. ఇళ్ళను కూల్చచేయటం, కాల్చటం, అత్యాచారాలకు పాల్పడటం, ధౌర్జన్యాలంతా తృణమూల్ పథకం ప్రకారమే చేసిందంటు బీజేపీ నేతలు కోర్టుల్లో కేసులు వేశారు. అయితే ఓటమి కారణంగా బీజేపీ నేతలు జనాలు, తృణమూల్ నేతలపై దాడులు చేసిందంటు మమత+తృణమూల్ నేతలు ఎదురు ఆరోపణలు చేశారు. అప్పటినుండి రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరగుతోంది.

వీళ్ళ గొడవలు సరిపోదన్నట్లు రాష్ట్ర గవర్నర్ కూడా మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు పంపారు కేంద్రానికి. అసలే మమత-గవర్నర్ జగదీప్ ధడ్ కర్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. దాంతో తాజా నివేదికతో గొడవలు మరింతగా పెరిగిపోయింది. ఈ గొడవలు అన్నీ దశలు దాటిపోయి న్యాయస్ధానాల ముందుకొచ్చాయి. మరి కోర్టులు ఏమి చేస్తాయనేది ఆసక్తిగా మారింది.

తమను ఓడించి హ్యట్రిక్ విజయం సాధించిన మమతపై నరేంద్రమోడి, అమిత్ షాకు మండిపోతోంది. పైగా అధికారంలోకి రాగానే బీజీపీ ఎంఎల్ఏలు, నేతలు తృణమూల్లోకి వెళిపోతుండటంపై మోడి మండిపోతున్నారు. ఇదే సమయంలో గొడవలకు మమత ప్రభుత్వమే కారణమన్నట్లుగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మమత ప్రభుత్వానికి తొందరలోనే ఏదో మూడిందనే ప్రచారం పెరిగిపోతోంది. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.