వ్యాక్సిన్ పై చేతులెత్తేసిన మోడి

కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధానమంత్రి నరేంద్రమోడి చేతులెత్తేశారు. ఇప్పటికే కరోనా వైరస్ ను ఎదుర్కోవటంలో మోడి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా 18 ఏళ్ళు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చని ప్రకటించిన కేంద్రం బాధ్యతలనుండి తప్పించుకుంది. కేవలం ప్రకటనవరకు చేసిన కేంద్రం తన నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యతను మాత్రం రాష్ట్రాలపైకి నెట్టేసింది.

కరోనా వైరస్ ఎటాక్ అవటానికి వయసుతో సంబంధం ఉండటంలేదు. వైరస్ భారిన పడిన వాళ్ళు, చనిపోతున్న వాళ్ళల్లో అన్నీ వయసుల వాళ్ళు ఉన్నారు. మొదటేమో 60 ఏళ్ళు పైన ఉన్నవారికి మాత్రమే టీకాలన్నారు. తర్వాత వచ్చిన ఒత్తిళ్ళు, ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని దీన్ని 45 ఏళ్ళకు కుదించారు. అయితే కేంద్ర నిర్ణయంపై ఆరోపణలు ఆగకపోవటంతో చివరకు టీకాలు వేయించుకునే వయసును 18 ఏళ్ళకి తగ్గించింది కేంద్రం.

వయసును తగ్గించిన కేంద్రం టీకాలు వేయటానికి అయ్యే ఖర్చునుండి మాత్రం తప్పుకుంది. ఇప్పటికే కొన్ని టీకాలకు బహిరంగ మార్కెట్లో చాల ధరలుంటున్నాయి. అలాంటిది తాజాగా 18 ఏళ్ళు నిండినవారు కూడా టీకాలు వేయించుకోవటం మొదలుపెడితే ఇపుడు జరుగుతున్న వ్యాక్సిన్ల ఉత్పత్తి సరిపోదు. దీంతో టీకాల ధరలు చుక్కలనంటడం ఖాయం. సరిగ్గా ఇక్కడే కేంద్రం తన బాధ్యతలనుండి తప్పుకున్నది.

కేంద్రం చేసిన ప్రకటన కారణంగా టీకాల కోసం 18 ఏళ్ళు నిండిన వారందరు రాష్ట్రప్రభుత్వాలపై ఒత్తిళ్ళు తీసుకొస్తారు. అందరికీ టీకాలు వేయించాలంటే అవసరమైన టీకాలుండాలి. టీకాల ఉత్పత్తేమో రాష్ట్రప్రభుత్వాల చేతిలో లేదు. టీకాల ఉత్పత్తి, సరఫరా మొత్తాన్ని కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకున్నది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి.

దీని కారణంగా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న టీకాల్లో సగం రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేయచ్చని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇక్కడ కూడా ఓ సమస్య మొదలవ్వబోతోంది. అదేమిటంటే రాష్ట్రాలకు నేరుగా ఇచ్చే సరఫరాలో ప్రభుత్వానికి, ప్రైవేటు సంస్ధలకు, కార్పొరేట్ ఆసుపత్రులకు కూడా భాగముంటుందట. దీంతో టీకాల కోసం జనాలందరు రాష్ట్రప్రభుత్వాలపై ఒత్తిళ్ళు మొదలుపెడతారు. అప్పుడు రాష్ట్రాల్లో గోల మొదలైపోతుంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిందే.