గాల్లో కరోనా.. సోషల్ మీడియాలో వైరల్ ..

గాల్లో కరోనా.. ఇప్పుడీ మాట సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ మస్తుగా వైరల్ గా మారుతోంది. ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లుగా పేర్కొంటూ కొన్ని కథనాలు వార్తా పత్రికల్లో జోరుగా దర్శనమిస్తున్నాయి. దీంతో.. అప్రమత్తత కంటే ఆందోళనకు గురి అవుతున్న వారే ఎక్కువ. ఇలాంటి వేళ.. గాల్లో కరోనా వాదనలో వాస్తవం ఎంతన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీసీఎంబీకి చెందిన నిపుణులుకొందరు గాల్లో కరోనా ముప్పునకు సంబంధించిన ఒక అధ్యయనాన్ని గతంలో నిర్వహించారు.

తాజాగా దీనికి సంబంధించిన వివరాల్ని సీసీఎంబీ – ఏఐసీ సీఈవో డాక్టర్ మధుసూదన్ రావు వెల్లడించారు. తాము నిర్వహించిన అధ్యయనాల ప్రకారం కొవిడ్ పాజిటివ్ వ్యక్తుల నుంచి రెండు మీటర్ల దూరం వరకు వైరస్ సూక్ష్మ కణాలు వ్యాపించి ఉంటాయని.. రెండు గంటల కంటే ఎక్కువే గాల్లో ఉంటాయని గుర్తించారు. కోవిడ్ పేషెంట్లు ఒక గదిలో ఎంతసేపు గడిపారన్న అంశంపై దాని వ్యాప్తి ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

“ఏదైనా కుటుంబంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తిని త్వరగా గుర్తించి.. విడిగా ఉంచటం చాలా అవసరం. అలాంటి సమయాల్లో ఇంట్లోని వారంతా మాస్కులతో ఉండటం చాలామంచిది. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఒక గదికి పరిమితం చేయటం అవసరం. దీని ద్వారా వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంది. సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటానికి కారణం కొత్త వైరస్సే అనటానికి సరైన ఆధారాలు లేవు. యూకే.. ఆఫ్రికా రకం వైరస్ కలిసి వ్యాపిస్తున్న డబుల్ మ్యూటెంటే కారణమని చెప్పలేం. కొన్ని కేసుల ఆధారంగా ఒక నిర్ణయానికి రాలేం. వైరస్ వేగంగా వ్యాపిస్తున్నందున జన సమూహాలు ఉండే ప్రాంతాలకు.. సినిమా హాల్.. ఆడిటోరియం లాంటి వాటి వద్దకు వెళ్లకపోవటం మంచిది” అని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెబుతున్నారు. సో.. గాల్లో కరోనా అన్నది అన్ని ప్రాంతాల్లో అని కాదు.. కోవిడ్ పాజిటివ్ పేషెంట్ ఉన్న ప్రాంతాల్లోని దగ్గర్లో అన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.