మోడి సర్కార్ పక్షపాతంతో వ్యవహరిస్తోందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. కరోనావైరస్ టీకాలు వేయించుకోవాలని, నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్న కేంద్రప్రభుత్వం అందుకు అవసరమైన టీకాలను మాత్రం సరఫరా చేయటం లేదనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దేశం మొత్తంమీద అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. తర్వాత ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్ ఘడ్, కర్నాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలున్నాయి.

చాలా వేగంగా కరోనా వైరస్ ఉధృతి పెరుగుతున్న రాష్ట్రాలుగా ఏపి, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాలున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్రం కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ నరేంద్రమోడిపై విరుచుకుపడ్డారు. ఎక్కువ కేసులు, మరణాలు నమోదవుతున్న మహారాష్ట్రకు వ్యాక్సిన్ పంపకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపించారు.

మహారాష్ట్ర ఆరోపణలో నిజం ఉందని బీజేపీయేతర రాష్ట్రాల మంత్రులు కూడా మద్దతుగా నిలబడ్డారు. దాంతో విషయం కాస్త రచ్చ రచ్చగా మారింది. దాంతో అప్పటికప్పుడు కేంద్రం మహారాష్ట్రకు వ్యాక్సిన్లను పంపిణీచేసింది. అంటే వ్యాక్సిన్ల పంపిణీలో కేంద్రం పక్షపాతంతో వ్యవహరిస్తున్న విషయం అర్ధమైపోయింది. ఏపికి 60 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాలని జగన్ పదే పదే కేంద్రాన్ని కోరుతున్నారు. అలాగే తెలంగాణాలో కూడా 25 లక్షల డోసుల వ్యాక్సిన్ అవసరమని వైద్యమంత్రి ఈటల రాజేందర్ కోరుతున్నారు.

ఒకవైపే బీజేపీయేతర ప్రభుత్వాలు వ్యాక్సిన్ల కోసం ఎంత మొత్తుకుంటున్న కేంద్రం డిమాండ్ కు తగ్గట్లు స్పందించటంలేదు. అదే సమయంలో తమ పాలిత రాష్ట్రాల విషయంలో మాత్రం వెంటనే స్పందిస్తోంది. ఇక్కడే నరేంద్రమోడి వ్యవహార శైలిపై గోల మొదలైంది. మనకే సరపడా వ్యాక్సిన్ సరఫరా లేనపుడు విదేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేయటం ఏమిటంటు ప్రతిపక్షాలు మోడిపై మండిపోతున్నాయి. అయినా మోడి ఎవరినీ లెక్కచేయటంలేదు. చివరకు ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.