సాగ‌ర్లో సీన్ మారుతోంది…!

తెలంగాణ‌లో ఉప ఎన్నిక జ‌రుగుతోన్న నాగార్జునా సాగ‌ర్ అసెంబ్లీ స్థానంలో విజ‌యం ఎవ‌రిది ? అన్న‌ది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ‌గా మారింది. మామూలుగా అయితే ఇక్క‌డ ఏ ఉప ఎన్నిక జ‌రిగినా టీఆర్ఎస్‌కు తిరుగు ఉండ‌ద‌న్న అభిప్రాయ‌మే నిన్న‌టి వ‌ర‌కు ఉంది. ఎప్పుడు అయితే దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ? ఆ త‌ర్వాత గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఊహించ‌ని విధంగా కార్పోరేట‌ర్ సీట్లు గెలిచిందో అప్ప‌టి నుంచి తెలంగాణ‌లో బీజేపీ ఎక్క‌డ సంచ‌ల‌నం క్రియేట్ చేస్తుందా ? అన్న ఉత్కంఠ అయితే అంద‌రిలోనూ ఉంది. ఇక సాగ‌ర్లో జ‌రుగుతోన్న ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌భావం లేక‌పోయినా ఇక్క‌డ కాంగ్రెస్ వ‌ర్సెస్ టీఆర్ఎస్ పోరు డిసైడ్ అయ్యింది.

సాగ‌ర్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ హోం మంత్రి జానారెడ్డికి కంచుకోట‌. ఆయ‌న ఇక్క‌డ ఏకంగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. నాలుగు ద‌శాబ్దాలుగా ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో మ‌మేక మ‌వుతూ వ‌స్తున్నారు. ఇక ఇప్ప‌టికే కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఖ‌రారైన జానా నియోజ‌క‌వ‌ర్గాన్ని ఓ విడ‌త చుట్టి వ‌చ్చేశారు. త‌న అనుచ‌రుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ అలెర్ట్ చేశారు. సాగ‌ర్లో జానాకే ఎక్కువుగా గెలుపు అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు కూడా ముందుగా అంచ‌నాలు వేశారు. అయితే రోజులు గ‌డుస్తోన్న కొద్ది.. ఇటు నామినేష‌న్ల ప‌ర్వం పూర్త‌య్యాక సీన్ మారుతోన్న‌ట్టే క‌నిపిస్తోంది.

ఇక్క‌డ గెల‌వ‌క‌పోతే ప‌రువు పోతుంద‌ని భావించిన సీఎం కేసీఆర్ త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టేశారు. మండ‌లాలు, గ్రామాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేల‌ను ఇన్‌చార్జ్‌లుగా పెట్టేశారు. ఇక ఏ ప్రాంతంలో ఏ కులం ఓట‌ర్లు ఎక్కువుగా ఉన్నారో అక్క‌డ ఆ కులానికి చెందిన మంత్రినో లేదా ఎమ్మెల్యేనో రంగంలోకి దింపేసి ఆ ఓట‌ర్ల‌ను త‌మ వైపున‌కు గంప‌గుత్త‌గా తిప్పేసుకుంటున్నారు. దుబ్బాక దెబ్బ‌తో కేసీఆర్ బెబ్బులిగా గాండ్రిస్తున్నారు. టీఆర్ఎస్ పక్కాగా రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా నిరూపించారు.

ఇప్పుడు సాగ‌ర్లో కూడా అదే ప్లానింగ్‌తో యుద్ధ తంత్రాలు ర‌చిస్తున్నారు. ఇక జానారెడ్డి అనుచ‌రుల హ‌వా ఉన్న గ్రామాల్లో కులాలు, వ‌ర్గాల వారిగా ఇప్ప‌టికే టీఆర్ఎస్‌ డ‌బ్బు పంపిణీ కూడా ప్రారంభ‌మైపోయింద‌ట‌. ఇక కేసీఆర్ హైద‌రాబాద్ నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారం అంతా ప్ర‌తి రోజు మానిట‌రింగ్ చేసుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, కీల‌క నాయ‌కుల‌కు ట‌చ్‌లో ఉంటున్నారు. టీఆర్ఎస్ ఇంత దూకుడుగా ఉంటే.. అటు సీనియ‌ర్ జానారెడ్డి ప్ర‌చారంలో ముందున్నా గెలుపు పోరులో వెన‌క‌ప‌డిపోతున్నారా ? అన్న సందేహాలు క‌నిపిస్తున్నాయి. ఓ వైపు జానాను గెలిపిస్తే పీసీసీ అధ్య‌క్షుడిని చేస్తార‌న్న ప్ర‌చారం ఊపందుకోవ‌డంతో సొంత పార్టీ నేత‌లే ఆయ‌న గెలుపు కోసం మ‌న‌స్ఫూర్తితో ప‌ని చేయ‌డం లేద‌న్న టాక్ వ‌చ్చేసింది.

ద‌ళితులు, ఎస్టీలు ఎలాగూ త‌మ‌కే ఓట్లు వేస్తార‌ని భావిస్తోన్న కాంగ్రెస్‌… నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న రెడ్డి వ‌ర్గం ఓట్ల‌ను పూర్తిగా త‌మ వైపున‌కు మ‌ళ్లించుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇది గ‌మ‌నించిన కేసీఆర్ ప‌లువురు రెడ్డి నేత‌ల‌ను లాగేసుకుంటున్నారు. ఇక బీజేపీ గురించి ఎక్క‌డ ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. 90 శాతం గ్రామాల్లో క‌మిటీలు లేవు. బీజేపీ అభ్య‌ర్థి ర‌వినాయ‌క్ కూడా జానా శిష్యుడే. దీంతో జానాకు ప‌డే ఓట్ల‌తో పాటు ఎస్టీ వ‌ర్గం ఓట్లు చీలిస్తే జానాకు మైన‌స్ అవుతుంద‌ని అంటున్నారు. ఇక నోముల భ‌గ‌త్‌కు సానుభూతితో పాటు బీసీ వ‌ర్గం ఓట్లు గంప‌గుత్త‌గా ప‌డే అవ‌కాశాలే ఎక్కువ‌. ఏదేమైనా సాగ‌ర్లో ముందు కాంగ్రెస్‌కు అనుకూలంగా వాతావ‌ర‌ణం కాస్తా ఇప్పుడు చాలా వ‌ర‌కు మారింది. మ‌రి ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఏం జ‌రుగుతుందో ? చూడాలి.