ఆదిలోనే బీజేపీ అభ్య‌ర్థి నోరు జారేరే!

రాజ‌కీయ అరంగేట్రంతోనే నోరు జారారు.. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నికలో బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి.. ర‌త్న‌ప్ర‌భ‌. నామినేష‌న్ వేయ‌డానికి ముందు.. మీడియాతో మాట్లాడిన ఆమె.. ఆమె.. ఏపీ అధికార పార్టీ వైసీపీపై గ‌తంలో తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించుకున్నారు. వాస్త‌వానికి క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా రిటైర్ అయిన త‌ర్వాత‌.. వైసీపీ నుంచి ఆమెకు ఆఫ‌ర్ వచ్చింది. ఈ క్ర‌మంలోనే ఏపీలో దివ్య‌మైన పాలన సాగుతోంద‌ని.. జ‌గ‌న్ అద్భుత‌మైన పాల‌న అందిస్తున్నార‌ని ట్వీట్ చేశారు ర‌త్న‌ప్ర‌భ‌.

ఇక‌, ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో ఏమో.. వైసీపీ నుంచి కానీ, ర‌త్న ప్ర‌భ నుంచి కూడా ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. ఇంత‌లో… బీజేపీ నేత‌లు ర‌త్న ప్ర‌భ‌ను కాంటాక్టు కావ‌డం.. గ‌తంలో క‌ర్ణాట‌క బీజేపీకి ఆమె మేళ్లు చేసి ఉండ‌డంతో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానాన్ని కేటాయించారు.. ఈ క్ర‌మంలో ఆమె తొలి సారి మీడియా ముందుకు వ‌చ్చీరావ‌డంతోనే రెండు కీల‌క విష‌యాల‌పై స్పందించారు. ఒక‌టి ప్ర‌త్యేక హోదా. రెండు వైసీపీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్య‌లు. ఈ రెండింటికీ కూడా ఆమె త‌న‌దైన శైలిలో స్పందించారు.

‘రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. నిధులు ఏ రూపంలో వచ్చాయన్నది కాదు. ప్రత్యేక హోదా కావొచ్చు.. ప్రత్యేక ప్యాకేజీ కావొచ్చు. ఏ రూపంలో నిధులు వచ్చినా అభివృద్ధి జరుగుతుంది’’ అని రత్నప్రభ అన్నారు. గతం లో ఆమె వైసీపీకి అనుకూలంగా ట్వీట్‌ చేయడం గురించి మాట్లాడుతూ.. మంచి ఎక్కడున్నా ప్రశంసిస్తానని ఆమె బదులివ్వ‌డం గ‌మ‌నార్హం. దీంతో బీజేపీ నేత‌లు ఖంగుతిన్నారు. బీజేపీ త‌ర‌ఫున పోటీకి నిల‌బడుతూ.. ఈ వ్యాఖ్య‌లేంట‌ని నాయ‌కులు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు..అప్ప‌ట్లో అన్నాం.. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి బాగోలేదు. ఎస్సీల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. దౌర్జ‌న్యాలు పెరుగుతున్నాయి. అని చెప్పి ఉంటే బాగుండేద‌ని.. అంతా అయిపోయిన త‌ర్వాత కొంద‌రు నేత‌లు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఆదిలోనే బీజేపీ అభ్య‌ర్థి ఇలా త‌డ‌బ‌డ‌డం… బీజేపీకి ఇబ్బందిగా మారింది.