పౌర సన్మానం ఎందుకు చేయించుకున్నారు ?

‘ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వటం కుదరదు’ ..ఇది తాజాగా పార్లమెంటులో ఓ కేంద్రమంత్రి చేసిన ప్రకటన. నిజానికి ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో ఇంత స్పష్టంగా కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించటం బహుశా ఇదే మొదటిసారి. గతంలో కూడా హోదా విషయంలో అనేకసార్లు అనేకమంది కేంద్రమంత్రులు చెప్పినా ఏదో డొంకతిరుగుడుగానే చెప్పారు. హోదా విషయంలో నరేంద్రమోడి ఆలోచన ఏమిటన్నది జనాలందరికీ ఎప్పుడో అర్ధమైపోయింది.

అయితే తాజాగా కేంద్రమంత్రి చెసిన ప్రకటన తర్వాత జనాలందరికీ ఓ సందేహం మొదలైంది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన వెంటనే వైజాగ్ లో అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు పే…ద్ద స్ధాయిలో పౌరసన్మానం జరిగింది. ఎందుకయ్యా అంటే ఏపికి ప్రత్యేకహోదా సాధించినందుకని. పౌరసన్మానికి ముందు వెంకయ్యను వైజాగ్ వీధుల్లో బ్రహ్మాండంగా ఊరేగించారు. పక్కనే చంద్రబాబునాయుడు, ఇఎస్ఎల్ నరసింహన్ కూడా ఉన్నారు.

నిజానికి అప్పటికి ప్రత్యేకహోదా విషయంలో నరేంద్రమోడి ఎలాంటి ప్రకటనా చేయలేదు. కనీసం ప్రధానమంత్రి హోదాలో తన మనసులోని మాటను కూడా బయటపెట్టలేదు. ఎన్నికల సమయంలో ప్రత్యేకహోదా విషయంలో బహిరంగసభల్లో మాట్లాడారంతే. ఇంతోటిదానికే వెంకయ్యను బ్రహ్మాండంగా సన్మానించేశారు. హోదా పై ప్రధాని ప్రకటన చేయకుండానే హోదాను సాధించేసినట్లు వెంకయ్యకు మరి పౌరసన్మానం ఎలా జరిగింది ?

ఎలాగంటే ఆయన సామాజికవర్గంలోని పెద్దలంతా కలిసి చేసిన మాయది. అప్పటి వైజాగ్ ఎంపి కంభంపాటి హరిబాబుతో పాటు మరికొందరు సామాజికవర్గంలోని ప్రముఖులు కలిసి జనాలను మోసం చేశారు. ప్రత్యేకహోదాను సాధించకుండానే సాధించేసినట్లు అసలు వెంకయ్య కూడా ఎలా సన్మానం చేయించుకున్నారో ఇప్పటికీ జనాలకు అర్ధంకాలేదు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల కారణంగా ప్రత్యేకహోదాను నరేంద్రమోడి తుంగలో తొక్కేశారు.

విచిత్రమేమిటంటే అప్పటి నుండి ఇప్పటివరకు ప్రత్యేకహోదా గురించి వెంకయ్య ఒక్కమాట కూడా మాట్లాడలేదు. తన కళ్ళముందే ఏపికి అన్యాయం జరుగుతున్నా వెంకయ్య చూస్తున్నారే తప్ప బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. పైగా రాష్ట్ర ప్రయోజనాలను సాధించే విషయంలో రాజీపడేది లేదని ఒకవైపు చెప్పిన అబద్ధాలు చెబుతునే ఉన్నారు. చివరకు యాక్టివ్ పాలిటిక్స్ లో దేశానికి చేసినసేవ చాలని చెప్పి కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యను ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతిగా పంపేశారు.

ఆ తర్వాత ఇదే విషయం ఆయన ముందు చర్చకు వచ్చినా ఉపరాష్ట్రపతి హోదాలో తాను రాజకీయాలను బహిరంగంగా మాట్లాడేందుకు లేదని తప్పించుకున్నారు. మరి పౌరసన్మానం ఎందుకు చేయించుకున్నారో మాత్రం వెంకయ్యనాయుడు సమాధానం చెప్పలేదు. తాజాగా కేంద్రమంత్రి చేసిన ప్రకటనతో అయినా వెంకయ్య సమాధానం చెబుతారా ?