రాహుల్ వ్యూహాత్మక ప్రచారం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తన ప్రచారంలో ప్రధానంగా తమిళనాడు, కేరళపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అర్ధమవుతోంది. కొద్దికాలం ముందునుండే రాహూల్ యువతను టార్గెట్ చేసుకుని ప్రచారం చేస్తున్న విషయాన్ని గమనించచ్చు. తాజాగా కేరళలోని కొచ్చిలో ఓ మహిళా కళాశాలలో చాలాసేపు గడిపారు. అక్కడి విద్యార్ధినులకు మార్షల్స్ ఆర్ట్స్ శిక్షణలో టిప్ప్ నేర్పించారు.

జపనీస్ మార్షల్స్ ఆర్ట్స్ ఐకిడో టిప్స్ నేర్పడం కోసం దాదాపు గంటపాటు కళాశాలలోనే ఉడిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వంటల కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతం యువతతో ఇప్పటికే రెండు మూడుసార్లు మాట్లాడారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని వంటలను అందరికీ రుచిచూపించే విషయంలో కొందరు యూట్యూబర్లతో కలిసి వంటలు చేశారు.

అలాగే జాలర్ల సమస్యలు తెలుసుకునేందుకు, సమస్యల పరిష్కారం పేరుతో కొందరు జాలర్లతో కలిసి చాలాసేపు సముద్రంలో ఈతకొట్టారు. తమిళనాడు, కేరళలో కలిపి సుమారు ఇప్పటికి 30 కళాశాలల్లోని విద్యార్ధులతో రాహూల్ వివిధ సమావేశాలు నిర్వహించారు. అంటే రాహూల్ పర్యటనలను చూస్తుంటే ప్రధానంగా యూత్ ను టార్గెట్ చేసిన విషయం అర్ధమైపోతోంది.

ఎన్నికల ప్రచారంలో రోడ్డుషోలు, బహిరంగసభలు, వీధి ప్రచారాల్లో ఒకవైపు సీనియర్ నేతలతో కలిసి బిజీగా ఉంటూనే మరోవైపు చాలాకొద్ది మందితో కలిసి కళాశాలల్లో తిరుగుతున్నారు. ఇదే పద్దతిని అస్సాం పర్యటనల్లో కూడా అమలు చేస్తున్నారు. అయితే పశ్చిమబెంగాల్ పర్యటన విషయంలో మాత్రం ఎందుకనో అంతగా యాక్టివ్ గా కనబడటంలేదు.

అయితే అస్సాంలో ప్రచారం విషయంలో మాత్రం తన సోదరి ప్రియాంక గాంధి కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. చూడబోతే రాహూల్, ప్రియాంకలు తమిళనాడు, కేరళ, అస్సాంపైనే ప్రధాన దృష్టి పెట్టినట్లు అర్ధమైపోతోంది. మరి వీళ్ళ కష్టం ఫలిస్తుందా ?