స్టాలిన్ హామీలపై ఆశ్చర్యపోతున్న జనాలు

డీఎంకే విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని హామీలను చూస్తే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఇచ్చిన హామీల్లో హిందు దేవాలయాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు ఆర్ధికసాయం, దేవాలయాలను పునర్నిర్మాణం లాంటి అనేక హామీలు ఉండటాన్ని చాలామంది నమ్మటంలేదు. ఎందుకంటే డీఎంకే పుట్టుకే నాస్తికవాదం పునాదులపై జరిగింది.

ద్రవిడపార్టీలు దేవాలయాలకు, పూజలకు, హైందవ సంప్రదాయాలకు దూరంగా ఉంటాయి. డీఎంకే కూడా దశాబ్దాల పాటు ఇదే పద్దతులను అనుసరిస్తోంది. అలాంటిది తాజాగా విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఆలయాల ఉద్దరణకు రూ. వెయ్యికోట్లుగా ప్రకటించారు. అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని అనుకునే వాళ్ళకు రూ. 25 వేలనుండి లక్ష రూపాయల ఆర్ధికసాయం చేస్తామన్నారు.

డీఎంకే చీఫ్ గా కరుణానిధి ఉన్నంత కాలం పార్టీ సిద్దాంతాలకు కట్టుబడున్నారు. ఆయన జీవితంలో ఒక్క దేవాలయాన్ని కూడా సందర్శించలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా ఎక్కడా పూజా కార్యక్రమంలో పాల్గొనలేదు. కనీసం స్వామీజీలతో కానీ పీఠాధిపతులను కూడా కలవలేదు. ఒకే ఒక్కసారి పుటపర్తి సాయిబాబాతో వేదికను పంచుకున్నారు. తమిళనాడులో దేవాలయాలకు కొదవేలేదు. అయినా ఏ దేవాలయం జోలికి వెళ్ళలేదు. చివరకు హిందు వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నం కూడా చేయలేదు.

తమిళనాడులో 43 వేల దేవాలయాలున్నాయి. వీటిల్లో కొన్ని జీర్ణావస్ధలో ఉన్నాయి. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీ ఇలాంటి దేవాలయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కమలంపార్టీ రాష్ట్రనేతలు తరచు దేవాలయాలను సందర్శించటం, హిందు సంఘాలతో సమావేశమవుతున్నారు. ఈ విషయాలను గ్రహించిన తర్వాతే స్టాలిన్ తన రూటును మార్చుకున్నట్లు అర్ధమవుతోంది. హిందువులను ప్రత్యేకంగా ఆకర్షించేందుకే మ్యానిఫెస్టోలో ప్రత్యేక హామీలిను ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. మరి మ్యానిఫెస్టో ఏ మేరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.