టీడీపీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలో కూడా వైసీపీనే డిసైడ్ చేస్తుందా?

ఎన్నికల్లో ఓటమితోనే రాజకీయ పార్టీ ఖతమైపోతుందా? రాజకీయం గురించి తెలిసిన వారెవరూ.. అవునన్న మాట చెప్పరు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ విపక్షం టీడీపీ ఘోర పరాజయం పాలైంది. తెలుగుదేశాధినేత.. పార్టీకి చెందిన నేతలు ఊహించలేరేమో కానీ.. ఏపీ రాజకీయ పరిణామాల్ని సునిశితంగా పరిశీలించే ప్రతి ఒక్కరు వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందన్న అంచనాలు వేసుకున్నారు. అనుకున్నట్లే.. వారు పురపోరులో విజయదుందుబిని మోగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ విజయానందంలో ఏపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఏపీలో టీడీపీ ఖతమైందని.. పూర్తిగా చచ్చిపోయిందని.. ఆ పార్టీ నిలదొక్కుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తేనే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ బాగుపడాలంటే.. నిలదొక్కుకోవాలంటే ఎవరిని తీసుకురావాలి? లాంటి సలహా ఇచ్చిన మంత్రిగా బాలినేని నిలిచిపోతారేమో? అయినా.. ఒక పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం.. దాని పని అయిపోతుందా? ఒకవేళ అయిపోతుంటే మాత్రం.. తన రాజకీయ ప్రత్యర్థిగా ఎవరు ఉండాలన్న విషయాన్ని మంత్రి బాలినేని లాంటోళ్లు కోరుకోవటం దేనికి నిదర్శనం అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

మరోవైపు రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టపడని వేళ.. ఆయన్ను సీన్లోకి తీసుకురావటం ద్వారా బాలినేని తనదైన పొలిటికల్ గేమ్ షురూ చేశారని చెబుతున్నారు. టీడీపీ పని అయిపోయింది.. ఫలానా వారు వస్తే తప్పించి ఆ పార్టీ బతికి బట్టకట్టదన్న విషయాన్ని అదే పనిగా ప్రస్తావించటంలో అర్థం లేదని చెప్పాలి. అయినప్పటికీ.. అలాంటి వ్యాఖ్యలు బాలినేని లాంటి మంత్రి ఒకరు చేయటం వెనుక బలమైన కారణం ఏదో ఒకటి ఉంటుందని చెబుతున్నారు. ఏమైనా మంత్రిగా ఉంటూ.. ఒక పార్టీ బతకాలంటే.. పోరాట పటిమను ప్రదర్శించాలంటే ఎవరు పగ్గాలు తీసుకోవాలో ప్రత్యర్థిగా బాలినేని వారు డిసైడ్ చేయటం విశేషంగా చెప్పక తప్పదు. దీనిపై టీడీపీవర్గాలు ఏ రీతిలో రియాక్టు అవుతాయో చూడాలి.