విభజన హామీపై మరో దెబ్బ

రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మరోదానిపై ప్రస్తుత నరేంద్రమోడి సర్కార్ దెబ్బ కొట్టింది. కేంద్రం దెబ్బ కొట్టిందనేకంటే రాష్ట్ర ప్రయోజనాలను మరోసారి మోసం చేయటమంటేనే కరెక్టు. మైనర్ పోర్టయిన రామాయపట్నం పోర్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిది కాదంటు తేల్చి చెప్పేసింది. రాజ్యసభలో బీజేపీ సభ్యులు టీజీ వెంకటేష్, జీవిఎల్ నరసింహారావు అడిగిన ఓ ప్రశ్నకు పోర్టులు, నౌకాయానమంత్రి మన్ సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు.

రామాయపట్నాన్ని రాష్ట్రప్రభుత్వం మైనర్ పోర్టు క్రింద నోటిఫికేషన్ ఇఛ్చిన విషయాన్ని మంత్రి తన సమాధానంలో గుర్తుచేశారు. కేంద్రప్రభుత్వం మేజర్ పోర్టులను తప్ప మైనర్ పోర్టులను నిర్మించదని మంత్రి స్పష్టంగా చెప్పేశారు. పోయిన ఏడాది రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఓ నోటిఫికేషన్ ఆధారంగా కేంద్రం తన బాధ్యతలనుండి పూర్తిగా తప్పించుకున్నది. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నం పోర్టును కేంద్రం నిర్మించాలి.

అయితే దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణానికి అక్కడ ప్రాంతం అనువుగా లేదని కేంద్రం చెప్పింది. దాంతో రాష్ట్రప్రభుత్వం ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం ఓడరేవును నిర్మిచాలని సూచించింది. దాన్నే ఇపుడు మేజర్ పోర్టు-మైనర్ పోర్టనే సాంకేతిక కారణాన్ని చూపించి బాధ్యత నుండి కేంద్రం తప్పుకున్నది. రామాయపట్నం మేజర్ పోర్టును నిర్మించాలని చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా కేంద్రం పట్టించుకోలేదు.

దాంతో కేంద్రంతో లాభం లేదని అర్ధమైన తర్వాత జగన్ మేజర్ పోర్టును మైనర్ పోర్టుగా మార్చారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే రెడీ అయ్యింది. దీన్నే కేంద్రం ఇపుడు అవకాశంగా తీసుకుంది. మైనర్ పోర్టు నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వటాన్ని సాకుగా చూపించి కేంద్రం తన బాధ్యతనుండి తప్పుకుంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పోర్టు మేజరా లేకపోతే మైనరా అని కాదు చూడాల్సింది. విభజన చట్టం ప్రకారం నిర్మించాల్సిన పోర్టును నిర్మించాల్సిందే. అయితే విభజన చట్టంలోని హామీలను ఒక్కొటే ఎగొట్టేస్తున్న కేంద్రం తాజాగా రామాయపట్నం పోర్టు నిర్మాణం హామీని కూడా గాలికొదిలేసింది. మొత్తం మీద నరేంద్రమోడి సర్కార్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏదో కక్షగట్టినట్లే అనుమానంగా ఉంది.