కాంగ్రెస్ కు తీరని అవమానం

ఒకపుడు దేశంలో చక్రం తిప్పిన పార్టీకి తమిళనాడు ఎన్నికల సందర్భంగా తీరని అవమానం జరిగిందా ? అవుననే అంటున్నారు టీపీసీసీ అద్యక్షుడు కేఎస్ అళగిరి. తొందరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేయబోయే సీట్ల విషయంపై డీఎంకే చీఫ్ స్టాలిన్ తో శనివారం సమావేశం జరిగింది. ఈ చర్చల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు కేటాయిస్తున్నట్లు స్టాలిన్ చెప్పారట.

అప్పుడెప్పుడో తమిళనాడును పాలించిన కాంగ్రెస్ చాలాకాలంగా అక్కడ తోకపార్టీగా మారిపోయింది. డీఎంకేతోనో లేకపోతే అన్నాడీఎంకేతోనో పొత్తులు పెట్టుకుని నెట్టుకొస్తోంది. రాబోయే ఎన్నికల్లో డీఎంకే మిత్రపక్షంగా ఎన్నికల్లోకి దిగబోతోంది. సీట్ల సర్దుబాటు చర్చల్లో భాగంగానే కాంగ్రెస్ కు 25 సీటకన్నా ఇవ్వటం సాధ్యం కాదంటు తెగేసి చెప్పారట. జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేయటం అవమానమని కనీసం 30 సీట్లన్నీ ఇవ్వాలని అడిగితే కుదరదుపొమ్మానరని స్వయంగా అళగిరే పార్టీ సమావేశంలో చెప్పారు.

2016 ఎన్నికల్లో డీఎంకే 40 సీట్లు కేటాయిస్తే కేవలం 8 సీట్లలో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ కు ఇపుడు 25 కన్నా సీట్లు అవసరం లేదని ప్రశాంత్ కిషోర్ తెగేసి చెప్పారట. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే 25 సీట్లకన్నా ఇచ్చేది లేదని స్టాలిన్ కాకుండా ప్రశాంత్ కిషోర్ చెప్పటమే. ఇదే విషయాన్ని పార్టీ సమావేశంలో చెప్పుకుని అళగిరి భోరుమన్నారట. కనీసం రాష్ట్ర ఇన్చార్జి, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కూడా గౌరవించలేదన్నారు.

2016 ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సందర్భంగా చేసిన తప్పును డీఎంకే ఈసారి చేయదని చీఫ్ ముందు ప్రశాంత్ ఊమెన్ చాందీతో చెప్పారట. అళగిరి చెప్పిన విషయం చూస్తుంటే స్టాలిన్ పైన కన్నా ప్రశాంత్ పైనే కాంగ్రెస్ నేతలకు పీకలదాకా కోపం ఉంది. కానీ ఏమి చేయలేని పరిస్దితి. 234 సీట్లలో డీఎంకే 180 సీట్లు, కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేస్తున్నాయి. మిగిలిన సీట్ల మరో మూడు మిత్రపక్షాలకు స్టాలిన్ కేటాయించారు.