కమల్ ముందు జాగ్రత్త పడుతున్నాడా ?

మక్కల్ నీది మయ్యుం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ ముందు జాగ్రత్తలు పడుతున్నట్లే అనిపిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయటానికి ఏర్పాట్లు చేసుకున్నారట. మామూలుగా ఒకటికంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేసే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకమేమో తమ గెలుపుపై నూరుశాతం ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. ఇక రెండో రకమేమో ఒక్కచోటే పోటీచేస్తే గెలుపుపై అనుమానం ఉండేవాళ్ళు.

గతంలో టీడీపీని పెట్టినపుడు ఎన్టీయార్ మూడు చోట్ల పోటీ చేసి గెలిచారు. 2009లో పీఆర్పీని పెట్టినపుడు చిరంజీవి రెండు చోట్ల పోటీచేశారు. అయితే ఒకచోట ఓడిపోయి మరోచోట గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కమల్ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గంతో పాటు అలందూరు నియోజకవర్గంలో కూడా పోటీ చేయబోతున్నారు.

పోయిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంఎన్ఎం పోటీ చేసింది. అయితే ఏ నియోజకవర్గంలో కూడా పెద్దగా ప్రబావం చూపలేకపోయింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పర్వాలేదన్నట్లుగా ఓట్లు తెచ్చుకుంది. అప్పుడే పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేయటంతో తమ పార్టీ జనాల్లో ప్రభావం చూపలేకపోయిందని అప్పట్లో కమల్ హాసన్ చెప్పుకున్నారు. మరిపుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోటీకి రెడీ అవుతున్నారు. కాబట్టి ఇపుడు ఎంఎన్ఎం పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

పోయిన పార్లమెంటు ఎన్నికల్లో శ్రీ పెరంబదూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అలందూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎన్ఎంకు 1.35 లక్షల ఓట్లొచ్చాయి. అలాగే కోయంబత్తూరు పార్లమెంటు పరిధిలోని దక్షిణ కోయంబత్తూరు అసెంబ్లీలో 1.45 లక్షల ఓట్లు వచ్చాయి. అంటే జనాల్లో తమ పార్టీకి ఆదరణ ఉందని అర్ధం చేసుకున్న కమల్ పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే పోటీకి దిగుతున్నారు. మరి కమల్ అదృష్టం ఎలాగుందో చూడాల్సిందే.