అతడి మోజులో భర్తను చంపించింది కానీ ఫోన్ తో బుక్ అయ్యింది

పోయే ప్రాణం ఊరికే పోదు. అందుకు కారణమైనోడి సంగతి తేలుస్తుంది. అందుకే..అర్థాంతంగా చచ్చిపోయినోళ్లు అందుకు కారణమైనోళ్లు చట్టం కంట్లో ఏదోలాపడటం మామూలే. అయినా.. ఒక మనిషితో కలిసి ఉండటం ఇష్టం లేకుంటే.. విడిగా వచ్చేసి బతికేస్తే సరిపోతుంది. లేదంటే.. చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నా అక్కడితో ఆ విషయం ముగుస్తుంది. అంతేకానీ.. ఏ మాత్రం తప్పు చేయని వారిని చంపేయటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు. ఇటీవల కాలంలో పరాయి మోజులో పడి భర్తల్ని భార్యలు చంపించే కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

అయితే.. అలాంటి ఉదంతాలన్నింటిలోనూ హత్యలకు కారణమైన వారు పోలీసులకు చిక్కటం..జైల్లో ఊచలు లెక్కించటం చూస్తున్నాం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన రేకుర్తి గ్రామంలో రాజయ్య మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడిగా పని చేసేవాడు. అతని భార్య లత తాపీ పనికి వెళ్లేది. ఈ క్రమంలోతాపీ మేస్త్రీ బాబుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్నిగుర్తించిన రాజయ్య భార్యను హెచ్చరించేవాడు.

ప్రియుడ్ని వదులుకోని భార్య.. భర్తను చంపేయించాలని ప్లాన్ చేసింది. బాబుకు విషయం చెప్పి తన భర్త అడ్డు తొలగించాలని కోరింది. ఫ్రిబవరి ఐదున విందు ఉందని ఆటో తీసుకొచ్చిన బాబు.. రాజయ్యను ఎక్కించుకొని వెళ్లాడు. తమ సొంతగ్రాంలో పుల్లుగా కల్లు తాగించి.. మత్తులో ఉన్న వేళ.. అదును చూసి మెడ మీద కొట్టి.. అనంతరం ఎస్సారెస్పీకెనాల్ లోకి తోసేశాడు. రాజయ్య చనిపోయిన విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న అనంతరం.. భర్త కనిపించటం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే రాజయ్య డెడ్ బాడీ దాదాపు 150కి.మీ. దూరానికి కొట్టుకుపోయి.. మహబూబ్ నగర్ జిల్లా కురవి వద్ద పోలీసులకు దొరికింది. విషయం తెలిసి లతను.. ఆమె కొడుకును.. బంధువుల్ని తీసుకొని అక్కడకు వెళ్లారు. అప్పటికే ఆమె ఫోన్ కాల్స్ మీద కన్నేసిన పోలీసులు.. ఆమెను అనుమానించారు. తమదైన శైలిలో విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకుంది. దీంతో..ఆమెను.. హత్య చేసిన బాబును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.