సంచ‌ల‌నం రేపుతున్న బాంబే హైకోర్టు తీర్పు

ఓ ప‌న్నెండేళ్ల బాలిక‌పై ఓ వ్య‌క్తి లైంగిక దాడికి పాల్ప‌డ్డ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచ‌ల‌నం రేపుతోంది. బాధితురాలి వ‌క్షోజాల్ని నొక్కాడ‌న్న‌ది ఆ వ్య‌క్తిపై ఉన్న అభియోగం. ఐతే నేరుగా చేత్తో వ‌క్షోజాల్ని తాకితేనే (స్కిన్ టు స్కిన్) లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లు అవుతుంద‌ని, ఒంటిపై టాప్ ఉండ‌గా ఇలా చేయ‌డం లైంగిక దాడి కిందికి రాద‌ని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది.

కేసుకు సంబంధించి పూర్తి వివ‌రాలు బ‌య‌టికి రాలేదు కానీ.. నిందితుడి చ‌ర్య‌లో త‌ప్పు లేద‌న్న‌ట్లుగా, లైంగిక దాడి విష‌యంలో కోర్టు ఇచ్చిన నిర్వ‌చ‌నం ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఈ తీర్పును మ‌హిళా వాదులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

మ‌హిళ‌ల‌పై జ‌రిగే లైంగిక దాడులు, అత్యాచారాల‌కు సంబంధించి ఎంత చ‌ర్చ జ‌రిగినా, చ‌ట్టాలు ఎంత క‌ఠినత‌రం చేసినా రోజూ దారుణాలు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని, ఇలాంటి స‌మ‌యంలో లైంగిక దాడికి కోర్టు ఇచ్చిన నిర్వ‌చ‌నం దురుద్దేశాలున్న‌ పురుషుల‌కు ఆయుధంగా మారుతుందని మ‌హిళా వాదులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. గాయ‌ని చిన్మ‌యి, న‌టి తాప్సి త‌దిత‌రులు ఈ తీర్పును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు.

మ‌న‌ దేశంలో మ‌హిళ‌ల‌కు జ‌రుగుతున్న న్యాయం ఇద‌ని.. ఈ దేశంలో లైంగిక దాడి చేసేవాళ్ల కోస‌మే ఉంద‌ని చిన్మ‌యి వ్యాఖ్యానించింది. సంబంధిత వార్త‌ను షేర్ చేసిన తాప్సి.. దీనిపై త‌న‌కు ఎలా స్పందించాలో కూడా తెలియ‌ట్లేద‌ని, మాట‌లు రావ‌ట్లేద‌ని ట్వీట్ చేసింది. కోర్టు ధిక్కారం అని కూడా చూడ‌కుండా చాలామంది మ‌హిళా వాదులు ఈ తీర్పుపై తీవ్రంగా స్పందిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఈ తీర్పుపై పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.