ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి ఖరారైనట్లు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల మంత్రి కొండా సురేఖ మీద బర్త్ రఫ్ వేటు వేయడం తెలిసిందే. ఈనేపథ్యంలో మూడో తేదీన జరిగిన పంచాయితీ సందర్బంగా మంత్రి పదవులు ఆశిస్తున్న నాయకులంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అప్పుడు విజయశాంతి కూడా ఢిల్లీకి వెళ్లారు. కానీ మీడియా ముందుకు రాకుండా జాగ్రత పడ్డారు. తన శైలికి భిన్నంగా సైలెంట్ గా పని కానిచ్చేయాలని విజయశాంతి భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి విజయశాంతికి ఎమ్మెల్సీ ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం మాట ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే సమయం, సందర్బం కోసం వేచి చూడమని ఢిల్లీ పెద్దలు సలహా ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడా సమయం ఆసన్నమైంది. కనుక ఆమెకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఈ మేరకు విజయశాంతికి ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
కొండా సురేఖ స్థానంలో విజయశాంతితో పాటుగా సీనియర్ నాయకుడు కేకే కూతురు విజయలక్ష్మి పేరు కూడా బలంగా వినిపించింది. అయితే ఆమెను కేబినెట్ హోదా కలిగిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా నియమించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ నియామకం జరిగినట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతుంది. విజయశాంతికి లైన్ క్లియర్ చేసే ఉద్దేశ్యంతోనే ఆఘమేఘాల మీద విజయలక్ష్మికి ప్రణాళికా సంఘాన్ని కట్టబెట్టినట్లు వినిపిస్తుంది. విజయలక్ష్మి కూడా మంత్రి పదవి కోసం పట్టుబడకుండా ఇచ్చిన పదవితో సరిపెట్టుకోవడం గమనార్హం.
తెలంగాణాలో కొండా సురేఖకు ఫైర్ బ్రాండ్ గా ఇమేజ్ వుంది. ఆమె స్థానాన్ని మరో ఫైర్ బ్రాండ్ తోనే భర్తీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. అందుకే విజయశాంతి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. సినీ నటిగా విజయశాంతి ఒక వెలుగు వెలిగారు. లేడి అమితాబ్ అన్న పేరును సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు ఇప్పటికీ ఇమేజ్ వుంది. ప్రజల్లో ఈజీగా దూసుకొని పోయే వ్యక్తిత్వం ఆమెకు సొంతం. దీన్ని పార్టీకి వినియోగించు కోవాలని కాంగ్రెస్ వ్యూహకర్తల ఆలోచనగా వుంది.
అంతేకాదు.. కొండా సురేఖ ఈ రోజు కాకపోయినా రేపైనా పార్టీ మారడం ఖాయమని అధిష్టానం భావిస్తుంది. ఇప్పటికే ఆమె బీసీ వాయిస్ వినిపిస్తున్నారు. బీసీ మంత్రిని కనుకనే తన మీద వేటు వేసినట్లు ఆరోపణలు చేశారు. రేపు బయటకు వచ్చే సమయంలో ఇదే ఆరోపణలను మరింత బలంగా వినిపించడం ఖాయంగా భావిస్తున్నారు. ఈ బీసీ వాదన కనుక ప్రజల్లోకి వెడితే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం వుంది. కనుక బీసీకి చెందిన కొండా సురేఖ స్థానాన్ని మరో బీసీ సామాజిక వర్గానికే చెందిన విజయశాంతితో భర్తీ చేయడం అవసరమని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates