రాజకీయ నాయకులకు కొన్ని ప్రత్యేకమైన మేనరిజాలు, సిగ్నేచర్లు ఉంటాయి. అవే వారికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా అలాంటి ప్రత్యేక శైలి ఉంది. చాలా రోజుల తర్వాత అదే మేనరిజాన్ని మళ్లీ ప్రదర్శించడంతో వైసీపీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.
2024 ఎన్నికలకు ముందు ప్రతి ఎన్నికల సభలో జగన్ ప్రసంగం ప్రారంభించే ముందు చేతిలోని మైక్ను తట్టి సౌండ్ చెక్ చేసేవారు. అనంతరం తాను ప్రసంగిస్తున్న ప్రాంతం పేరును గట్టిగా పలికి ప్రసంగాన్ని ప్రారంభించేవారు. ఇది ఆయనకు ప్రత్యేక గుర్తింపుగా మారింది.
ఎన్నికల తర్వాత దాదాపు రెండేళ్లకు భీమవరంలో నిర్వహించిన ఆక్వా రైతుల బహిరంగ సభలో జగన్ మళ్లీ అదే శైలిని ప్రదర్శించారు. వేదికపైకి వచ్చిన వెంటనే మైక్ను తీసుకుని సౌండ్ చెక్ చేసి, “భీమవరం” అని పిలవడంతో సభలో ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. “మా పాత జగన్ మళ్లీ కనిపించారు”, “జగన్ ఈజ్ బ్యాక్” అంటూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
అదే సభలో జగన్ తనదైన శైలిలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచి ఆక్వా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ హామీని అమలు చేశారా? అంటూ ప్రశ్నించారు. “గట్టిగా… ఇలా… ఇలా… ఇలా… అనండి” అంటూ తన మార్క్ డైలాగ్తో సభలో ఉత్సాహాన్ని నింపారు.
మొత్తానికి, చాలా రోజుల తర్వాత జగన్ తన పాత మేనరిజంతో కనిపించడంతో అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తూ ఆ దృశ్యాలను విస్తృతంగా పంచుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates