హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్ (ఎక్స్కవేటర్)ను స్వయంగా నడిపి హంద్రి–నీవా కాలువ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. భారీ యంత్రాన్ని నడుపుతూ మట్టిని తొలగించిన బాలయ్య తీరు అక్కడికి వచ్చిన ప్రజలు, రైతులు, కార్యకర్తలను ఆకట్టుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా రైతులకు సాగునీటి భరోసా కల్పించే లక్ష్యంతో రూ.790 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హంద్రి–నీవా మడకశిర బ్రాంచ్ కాలువ విస్తరణ పనులను హిందూపురం మండలం రాచపల్లి గ్రామం వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. భూమిపూజ అనంతరం బాలయ్య నేరుగా పొక్లెయిన్పైకి ఎక్కి కొద్దిసేపు యంత్రాన్ని నడుపుతూ మట్టిని తొలగించి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకోగా, సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి.
ప్రజా కార్యక్రమాల్లో స్వయంగా వాహనాలు నడపడం బాలకృష్ణకు ఇదే తొలిసారి కాదు. గత ఏడాది ఆగస్టు 15న మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభోత్సవంలో హిందూపురంలో ఆర్టీసీ బస్సును స్వయంగా నడిపి అందరి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం అమరావతిలో నిర్వహించిన డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యే సందర్భంగా తోటి ఎమ్మెల్యేలను తానే బస్సు నడుపుకుంటూ వేదిక వద్దకు తీసుకెళ్లి మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇప్పుడు బస్సు తర్వాత భారీ నిర్మాణ యంత్రాన్ని నడిపి హంద్రి–నీవా పనులకు శ్రీకారం చుట్టడంతో, బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రజా కార్యక్రమాల్లో భిన్నంగా పాల్గొంటూ తనదైన ముద్ర వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates