‘శ‌వాలు లేస్తే కానీ… వైసీపీకి సంతోషం రాదు’

వ‌చ్చే మూడేళ్ల‌లో తానేంటో చూపిస్తాన‌ని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాకినాడలో శ‌నివారం రాత్రి ఆయ‌న ఓ స‌భ‌లో మాట్లాడారు. వైసీపీ నాయ‌కులు కులం రాజ‌కీయాల‌తో కుట్రలు చేస్తున్నార‌ని అన్నారు. వారికి త‌న‌దైన రీతిలో తానేంటో చూపిస్తాన‌ని హెచ్చ‌రించారు. డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని చంపి.. శ‌వాన్ని డోర్ డెలివ‌రీ చేసిన‌ అనంత‌బాబుకు జేజేలు ప‌లుకుతున్నార‌ని వైసీపీ నేత‌ల‌పై మండిప‌డ్డారు. అప్పుడు ఎందుకు కులం గుర్తుకురాలేద‌న్నారు.

రాష్ట్ర హోం మంత్రి అనిత‌ను తిట్టిన వైసీపీ వారిని(గుడివాడ అమ‌ర్నాథ్‌) చూసి రేపు మ‌రికొంద‌రు రాష్ట్రంలోని ఆడ‌ప‌డుచుల‌ను దూషిస్తార‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అత్యంత క‌ఠినంగా ఉండాల‌ని తెలిపారు. వైసీపీ గూండాల‌ను తొక్కి నార‌తీస్తామ‌ని హెచ్చ‌రించారు. ఇక‌, సుగాలి ప్రీతి కేసును కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను కొంద‌రు ధ్వంసం చేశార‌ని.. సాక్ష్యాధారాలు ధ్వంస‌మైన కేసుల‌ను ఏం చేస్తామ‌ని.. ప్ర‌శ్నించారు. శ‌వాలు లేస్తే కానీ.. వైసీపీకి సంతోషం రాద‌ని దుయ్య‌బ‌ట్టారు.

క్రిమిన‌ల్స్‌ను కులం కోణంలో చూడ‌రాద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. వైసీపీ బ‌ల‌మే కులం క్రిమిన‌ల్స్ అని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. నేర‌స్తులు రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌వుల్లో కూర్చుని శాసిస్తామంటే జీవితాంతం తాను పోరాడ‌తాన‌ని చెప్పారు. క్రిమిన‌ల్స్ పాల‌కులుగా ఉండ‌కూడ‌ద‌న్న‌దే త‌న సిద్ధాంత‌మ‌ని వ్యాఖ్యానించారు.

వైసీపీ క్రిమిన‌ల్స్‌ను చూస్తూ ఊరుకునేది లేద‌ని.. తొక్కినార తీస్తామ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జాస్వామ్యంంలో క్రిమిన‌ల్స్‌కు చోటు లేద‌న్నారు. వారు రాజ్యాంగ ప‌ద‌వుల్లోకి రాకుండా అడ్డుకుంటామ‌ని వ్యాఖ్యానించారు. దీనికిగాను తాను ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మేన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు.