‘పెట్రోల్ ధరలు వెంట‌నే పెంచామా.. వెంట‌నే త‌గ్గించ‌డానికి?’

పెట్రోల్ ధ‌ర‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పెట్రోలియం శాఖ కార్య‌ద‌ర్శి శుక్ర‌వారం ఢిల్లీలో విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గిస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు. అయినా.. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను వెంట‌నే పెంచ‌లేద‌ని.. ప్ర‌పంచ దేశాల‌న్నీ.. పెంచినా.. భార‌త్ సంయ‌మ‌నం పాటించి ప్ర‌జ‌ల‌పై భారాలు మోప‌కుండా చూసింద‌ని తెలిపారు. నెమ్మదిగానే పెంచింద‌ని చెప్పారు. కాబ‌ట్టి.. ఇప్పుడు కూడా నిర్ణ‌యం తీసుకునేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

కేంద్ర మంత్రి కూడా..

కేంద్ర పెట్రోలియం శాఖ స‌హాయ మంత్రి, కేర‌ళ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు సురేష్ గోపీ కూడా.. ఇదే విష‌యాన్ని చెప్పుకొచ్చారు. తిరువ‌నంత‌పురంలో మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌పంచ దేశాల‌న్నీ ధ‌ర‌ల‌ను పెంచినా.. భారత ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పై కేవ‌లం 3.25 రూపాయ‌ల మేర‌కు మాత్ర‌మే పెంచిందన్నారు. అమెరికా-ఇరాన్ మ‌ధ్య ఒప్పందం కుదిరింద‌ని, హార్ముజ్ జ‌ల‌సంధిని తెరిచార‌ని.. కాబ‌ట్టి ఇప్ప‌టికిప్పుడు ధ‌ర‌లు త‌గ్గించ‌లేమ‌ని స్ప‌ష్టం చేశారు.

ఎలా అయితే.. ధ‌ర‌లు పెంచేందుకు స‌మ‌యం ప‌ట్టిందో.. ఇప్పుడు కూడా అంతే స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు. అయినా.. వాస్త‌వానికి.. ప్ర‌జ‌లు కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప‌ట్ల వ్య‌తిరేకంగా ఏమీలేర‌ని.. చెప్పారు. అంటే.. ప‌రోక్షంగా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌క‌పోయినా.. ఇబ్బంది లేద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కేంద్ర ప్ర‌భుత్వం 12 వేల కోట్ల రూపాయ‌ల ఆదాయాన్ని కోల్పోతోంద‌ని చెప్పారు. ఇప్ప‌టికిప్పుడు ఏమీ జ‌రిగిపోద‌ని వ్యాఖ్యానించారు.

ఎందుకీ చ‌ర్చ‌!

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపున‌కు హోర్ముజ్ జ‌ల‌సంధిలో ఏర్ప‌డిన ఆటంకాలే కార‌ణం. అయితే.. ప్ర‌స్తుతం ఈ జ‌ల‌సంధిని ఇరాన్ స్వేచ్ఛ‌గా తెరిచింది. ఎలాంటి సుంకాలు కూడా వ‌సూలు చేయ‌బోమ‌ని పేర్కొంది. గ‌త రెండు రోజుల నుంచి హోర్ముజ్‌లో నౌకా ర‌వాణా సుల‌భంగా సాగుతోంది. దీంతో ఇంధ‌న ర‌వాణాకు ఏర్ప‌డిన ఆటంకాలు తొల‌గిపోయాయి. ఫ‌లితంగా.. ముడి చ‌మురు ధ‌ర‌లు కూడా.. త‌గ్గు ముఖం ప‌ట్టాయి. దీంతో దేశంలో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గిపోతాయ‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపైనే కేంద్రం స్పందించింది.