కేసీయార్ సరెండర్ అయిపోయినట్లేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతన్నది చూస్తుంటే కేంద్రప్రభుత్వానికి కేసీయార్ పూర్తిగా సరెండర్ అయిపోయినట్లే అనుమానాలు పెరిగిపోతోంది. దుబ్బాక ఎన్నికలకు ముందు కేంద్రంలోని నరేంద్రమోడి సర్కార్ పై ఎంతమాట పడితే అంత మాట్లాడేసేవారు కేసీయార్. ఆయుష్మాన భవ లాంటి కొన్ని కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేసేది లేదని ప్రతిజ్ఞ చేశారు. ఈమధ్యనే కేంద్రం చేసిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేదే లేదని తెగేసి చెప్పారు.

గ్రేటర్ ఎన్నికల సందర్భంలో అయితే కేంద్రంపై ఇక యుద్ధమే అంటూ చాలా భీకరంగా ప్రకటించారు. ఇన్ని మాటలు మాట్లాడిన కేసీయార్ చివరకు ఏమి చేస్తున్నారు ? గ్రేటర్ ఎన్నికల ఫలితల తర్వాత ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నట్లే అనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న తర్వాత హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారు. మూడురోజుల పర్యటనలో మోడిని కలిసిన తర్వాత ఏమైందో ఎవరికీ స్పష్టంగా తెలీదు. మొత్తానికి కేంద్రం ఏమి చెబితే మారుమాట్లాడకుండా ఫాలో అయిపోతున్నారు.

అసలు కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్కమాటంటే ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. పైగా గతంలో తాను తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్ర పథకాలనే ఇపుడు చాలా హడావుడిగా అమలు చేసేస్తున్నారు. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎంను ఎంతగా విమర్శలు చేస్తున్నా, ఎన్ని ఆరోపణలు చేస్తున్నా అసలు కౌంటర్లు ఇవ్వటమే లేదు. కేసీయార్ కాదు కదా కనీసం చోటామోటా లీడర్లు కూడా బీజేపీ నేతలకు కౌంటర్లు ఇవ్వటం లేదు.

ఉద్యమనేతగా పాపులరైన కేసీయార్ కు ఇపుడేమైంది ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఢిల్లీలో మొత్తానికి ఏమో జరిగింది. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు మరి ఏమి చూపించారో లేకపోతే ఏమి మాట్లాడారో ఏమో తెలీటం లేదుకానీ కేసీయార్ మాత్రం అసలు నోరేవిప్పటం లేదు. పైగా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేస్తున్నారు. అలాగే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేస్తానని కూడా ప్రకటించేశారు.