వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, టీడీపీ నేతలు.. బూతు మంత్రిగా పిలుచుకునే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని.. తన పొలిటికల్ వారసుడిని ప్రకటించారు. తన సోదరుడి కుమారుడు.. కొడాలి అర్జున రావును ఆయన తన వారసుడిగా పరిచయం చేశారు. తాజాగా వైసీపీ నేతలు నియోజకవర్గాల స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16 నుంచి చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో గుడివాడలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని.. కొడాలి రాజకీయ వారసుడిపై కీలక ప్రకటన చేశారు. కొడాలి అర్జున రావు.. నానీ స్థానంలో వైసీపీ తరఫున రాజకీయాలు చేస్తారని ప్రకటించారు. ఈ సందర్భంగా అర్జునరావును పార్టీ కేడర్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. అర్జున రావు.. ఉన్నత విద్యావంతుడని.. తన తమ్ముడి కుమారుడని పేర్కొన్నారు.
2034 ఎన్నికల్లో అర్జునరావు గుడివాడ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారని కొడాలి నాని ప్రకటించారు. దీనిని బట్టి.. గుడివాడ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో మరోసారి కొడాలి నానీనే పోటీ చేయనున్నారన్నది సుస్పష్టం అయింది. వాస్తవానికి గత 2024 ఎన్నికల ప్రచారంలో నానీ సంచలన ప్రకటన చేశారు. తను.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని.. ఈసారికి గెలిపించాలని ఆయన కోరారు. అయితే.. గుడివాడ ప్రజలు ఆయన విన్నపాన్ని తోసిపుచ్చారు.
ఈ క్రమంలోనే టీడీపీ నాయకుడు, ఎన్నారైనేత వెనిగండ్ల రామును ప్రజలు గెలిపించారు. కాగా.. కొడాలి నానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన సోదరుడి కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని గత ఎన్నికల సమయంలోనే ప్రకటించారని అంటున్నా.. ఇప్పుడు నేరుగా అర్జున రావును స్థానిక ప్రజలకు పరిచయం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates