అవినీతిని పట్టిస్తే… విజయ్ లక్ష ఇస్తారట!

సినిమాల్లో నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారే సీఎం కుర్చీని దక్కించుకున్న దళపతి విజయ్ పెను సంచలనమే రేపారు. ఎన్నికల్లో అసలు డబ్బు మాట ఎత్తకుండా… సీఎంగా అవకాశం ఇస్తే తానేం చేస్తానన్న విషయాలనే పదే పదే చెబుతూ వచ్చిన విజయ్… తాను అనుకున్న లక్ష్యాన్ని అయితే చేరుకున్నారు. మొత్తంగా జనానికి నచ్చిన విషయాలనే పట్టేసిన విజయ్.. సీఎం హోదాలోనూ జనం మెచ్చిన నాయకుడిగానే సాగుతున్నారు. అవినీతిపై పోరాటం మొదలెట్టిన విజయ్… అవినీతిని పట్టిస్తే… ఏకంగా రూ.1 లక్ష బహుమతి ఇస్తానంటూ తాజాగా ఓ సంచలన ప్రకటన చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని విభాగాల్లో పేరుకుపోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తానని విజయ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మాటను తమిళ ఓటర్లు బాగానే నమ్మారు. విజయ్ పార్టీ టీవీకే అభ్యర్థులకు ఓట్లను వేశారు. అంతిమంగా విజయ్ కి అదికార పగ్గాలను అందజేశారు.

తాను అనుకున్నట్లుగా తమిళ ప్రజలు తనకు అధికారం ఇస్తే… తాను కూడా వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కదా అంటూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ విజయ్ సాగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అవినీతిపై యుద్ధాన్ని ప్రకటించిన విజయ్… అవినీతి అధికారులను పట్టించిన వారికి నజరానా ప్రకటిస్తూ సంచలన ప్రకటన చేశారు.

ఈ ప్రకటన ప్రకారం ఏదైనా పని కోసం జనం ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే.. ఆయా పనులు చేసి పెట్టేందుకు అధికారులు జనం నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అలా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేసే ఘటనలకు సంబంధించి ఆధారాలు అందిస్తే… సంబంధిత వ్యక్తులకు ప్రభుత్వం రూ.1 లక్ష నజరానాను అందించనుందట. విజయ్ సర్కారు నుంచి వెలువడిన ఈ ప్రకటన తమిళ తంబీలను ఉబ్బితబ్బిబ్బు చేస్తుంటే… ప్రభుత్వ అధికారులను మాత్రం డైలమాలో పడేసిందన్న మాట వినిపిస్తోంది.