నాయకుల ఇబ్బందిని పవన్ లైట్ తీసుకున్నారా?

ఏపీలో కూట‌మి పార్టీ ప్ర‌భుత్వం బ‌లంగా ఉంది. వ‌చ్చే 15 ఏళ్ల‌పాటు ప్ర‌భుత్వాన్ని కొన‌సాగిస్తామ‌ని కూడా చెబుతోంది. ఉన్న‌త‌స్థాయిలో సీఎం, డిప్యూటీసీఎంగా ఉన్న చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు క‌లివిడిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప‌ర‌స్ప‌రం గౌర‌వం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇక‌, మిత్రప‌క్షం బీజేపీకూడా క‌లివిడిగానే ఉంది. ఆ పార్టీ నాయ‌కులు కూడా.. ప్ర‌భుత్వానికి అనుకూలంగా నే ఉన్నారు.

అయితే.. ఈ ప‌రిణామం.. నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే!. రెండో వైపు క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల మ‌ధ్య క‌లివిడి లోపిస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కుల మ‌ధ్య వివాదాలు.. విభేదాలు కొన‌సాగుతున్నాయి. ఇది పార్టీల‌కు త‌ల‌నొప్పిగామారింది. ఈ విష‌యాన్ని జ‌న‌సేన అధినేత‌ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల కూడా ప్ర‌స్తావించారు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల మ‌ధ్య విభేదాలు ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పారు. అయితే.. అంద‌రూ అనుకుంటున్న‌ట్టుగా మాత్రం కాద‌న్నారు.

అవ‌న్నీ చిన్న పాటి విభేదాలేన‌ని..కలిసి కూర్చుని మాట్లాడుకుంటే స‌మ‌సిపోతాయ‌ని అన్నారు. ఆయ‌న ఈ మాట‌లు అన్న 24 గంటల్లోనే రాజోలు స‌హా.. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి నాయ‌కుల మ‌ధ్య ఉన్న విభేదాలు బ‌య‌ట‌కు పొడ‌చూపాయి. ఇక‌, పిఠాపురంలో ఎలానూ వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. త‌మ‌కు ప్రాధాన్యం లేకుండా పోతోంద‌న్న‌ది జ‌నసేన వ‌ర్గాలు చెబుతున్న మాట‌. టీడీపీ నాయ‌కులు ఆధిప‌త్యం చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అంటే.. పైకి చెబుతున్న‌ట్టు.. పైపైన చేస్తున్న‌ట్టు క్షేత్ర‌స్థాయిలో ఉన్న స‌మ‌స్య‌లు.. వివాదాలు చిన్న‌వి అయితే కావు. అవి పెద్ద‌విగానే ఉన్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇవి మ‌రింత పెర‌గ‌కుండా ఉండాలంటే.. వాటిని చిన్న‌వి చేసి చూస్తే స‌రిపోద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

అదేస‌మ‌యంలో కేవ‌లం ప్ర‌సంగాల‌తో ప‌నిజ‌ర‌గ‌ద‌ని కూడా అంటున్నారు. నాయ‌కుల‌తో మ‌మేకం కావ‌డంతోపాటు.. వారి ఆకాంక్ష‌లు తెలుసుకుని.. దానికి అనుగుణంగా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కూడా చెబుతున్నారు. మ‌రి ఆదిశ‌గా కూట‌మి నాయ‌కులు అడుగులు వేయాల్సి ఉంటుంది.