ఇరాన్పై జరుగుతున్న యుద్ధం(ప్రస్తుతం తాత్కాలిక విరామం ప్రకటించారు) కారణంగా పశ్చిమాసియా లోని కీలక ఇంధన రవాణా మార్గం హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన దరిమిలా.. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా వంట గ్యాస్ సమస్య అనేక దేశాలను ఇప్పటికీ పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇరాన్ ప్రతినిధులను దేశంలోకి అనుమతించింది. తద్వారా దౌత్య సంబంధాలు సడలకుండా చూసుకుంది.
ఫలితంగా చమురు, గ్యాస్ రవాణా వంటివి ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్కు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా 20 వేల టన్నుల వంట గ్యాస్తో కూడిన సైమి నౌక.. గుజరాత్ పోర్టుకు చేరుకుంది. ఇది పూర్తిగా ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన నౌకగా అధికారులు తెలిపారు.
ఫలితంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్కు ఈ ఏడాది పొడవునా ఇబ్బందులు ఉండవని చెప్పారు. ఇప్పటికే వచ్చే మూడు మాసాలకు సరిపోయేలా గ్యాస్ నిల్వలు దేశంలో ఉన్నాయని.. ప్రస్తుతం వచ్చిన సైమీతో మరో ఆరు మాసాలకు ఇబ్బందులు ఉండవని వెల్లడించారు.
ఇంకోవైపు.. సైమీకి డబుల్ అన్నట్టుగా 42.5 వేల టన్నుల గ్యాస్తో కూడిన.. సన్ షైన్ నౌక కూడా సోమ వారం నాటికి కర్ణాటకలోని మంగళూరు పోర్టుకు చేరుకుంటుందని వివరించారు. తద్వారా దేశవ్యాప్తంగా వంట గ్యాస్కు ఎలాంటి ఇబ్బందీ ఉండదని పేర్కొన్నారు. ప్రస్తుతం చమురు రవాణా నౌకలు మాత్రమే హోర్ముజ్ జలసంధిలో చిక్కుకున్నాయని..
ఇవి 12 నౌకలని వివరించారు. వీటిని కూడా సాధ్యమైనంత వేగంగా భారత్కు రప్పించేందుకు ఇరాన్ ప్రతినిధులతో చర్చలు సాగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న ఇంధనం వచ్చే మూడు నుంచి నాలుగు మాసాలకు సరిపోతుందని వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates