రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తాజా పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ.. ఈ ప్రక్రియను చేపడుతోంది. అయితే.. ఆది నుంచి సర్ ప్రక్రియ అనగానే పార్టీలకు భయం నెలకొంది. తమ అనుకూల ఓటు బ్యాంకు ఎక్కడ పోతుందోనన్న బెంగ ఆయా పార్టీలను వేధిస్తోంది. గతంలో బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించారు.
ఇదే విధానం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనుసాగుతుందా? అనేది పార్టీలను వేధిస్తున్న ప్రశ్న. వాస్తవానికి 2021లో సర్ ప్రక్రియను చేపట్టారు. అయితే.. అప్పట్లో ఇలాంటి వాదన కనిపించలేదు. వినిపించలేదు. కానీ, ఇటీవల కాలంలో బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును పెంచుతున్నారన్న వాదన ఉండడంతో పార్టీలకు సహజంగానే ఇబ్బంది కలుగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం సర్ ప్రక్రియను ఆహ్వానించింది. కానీ లోలోపల మాత్రం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తెలంగాణలోనూ బీఆర్ ఎస్ పార్టీలో ఈ తరహా ఇబ్బందులు నెలకొన్నాయి. కానీ.. ఎవరూ బయటకు చెప్పడం లేదు. ఈ క్రమంలో అంతర్గత చర్చల్లో మాత్రం సర్ ప్రక్రియపై వెయ్యి కళ్లు వేయాలని.. అన్ని విషయాలను నిశితంగా గమనించాలని మాత్రం నాయకులు, పార్టీలు నిర్ణయించాయి. ఎన్నికల అధికారుల పర్యటనకు ముందే.. పార్టీ తరఫున సర్వేలు చేయించాలని నిర్ణయించారు. ఈ విషయంలో బీఆర్ ఎస్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలను, నాయకులను అలెర్ట్ చేసింది.
తద్వారా ముందుగానే తేడాలు గుర్తించి.. ఎన్నికల అధికారులకు, ముఖ్యంగా బీఎల్వోలకు తమ వాదన వినిపించే ప్రయత్నం చేస్తుంది. అలానే.. టీడీపీ కూడా తమ పార్టీ కార్యకర్తలను సిద్ధం చేసింది. తద్వారా.. తమ అనుకూల ఓటర్లు.. నష్టపోకుండా చర్యలు చేపట్టనున్నారు. మరోవైపు.. వైసీపీ, కాంగ్రెస్లు కూడా.. తమ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. సర్ ప్రక్రియను స్వాగతిస్తున్నా.. పార్టీల్లో నెలకొన్న ఆందోళ న మాత్రం కొనసాగుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
