నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు ఉదాహరణగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవనం నిలుస్తోంది. అప్పుడప్పుడో అల్లూరి జిల్లాలో పర్యటించిన సందర్భంగా పాడుబడిన ఆ పాఠశాలను సందర్శించిన పవన్.. అక్కడి పిల్లలు, ఉపాధ్యాయుల కోరిక మేరకు నూతన భవనం నిర్మించి ఇస్తామని మాట ఇచ్చారు. చెప్పినట్టుగానే ఇప్పుడు ఆ పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించి ఇచ్చారు.
గతంలో గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన పవన్ కల్యాణ్… అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పరిధిలోని పెదపాడు గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కింద నడుస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రభుత్వ పాఠశాల భవనంలోకి వెళ్లి… ఉపాధ్యాయులు, విద్యార్థులతో మమేకం అయ్యారు. తమ పాఠశాలకు పవన్ రావడంతో ఉబ్బితబ్బిబ్బైన పిల్లలు, టీచర్లు…తమ పాఠశాల భవనం పాతది అయిపోయిందని, శిథిలావస్థకు చేరుకుందని కొత్త భవనాన్ని నిర్మించాలని కోరారు.
ఈ సందర్భంగా పిల్లలతో పాటు పవన్ కూడా పాడుబడ్డ భవనం మాదిరిగా ఉన్న తరగతి గదిలోకి వెళ్లారు. అక్కడి పరిస్థితులను గమనించారు. కొత్త భవనం కట్టించాలన్న పిల్లల అభ్యర్థనలో వాస్తవముందని గ్రహించారు. అంతే… ఏమాత్రం ఆలోచించకుండా ఈ పాఠశాలకు కొత్త భవనాన్ని నిర్మించి ఇస్తామని మాట ఇచ్చారు.
అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన పవన్ ఆ విషయాన్ని మరిచిపోలేదు. సంబంధిత శాఖ అదికారులతో చర్చించారు. కొత్త భవనాన్ని మంజూరు చేశారు. కొత్త భవనం కోసం రూ.17.50 లక్షలను మంజూరు చేయించారు. ఆ నిధులతో పాఠశాల భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ పాఠశాలలో చదవుకుంటున్న పిల్లలు కొత్త భవనాన్ని చూసి కేరింతలు కొడుతున్నారు. దీనిని చూసిన వారంతా పవన్ ఏదైనా చెప్పారంటే చేసేస్తారంతే అని గుర్తు చేసుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates