బండి సంజయ్ కు సీఎం షాక్

కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు మత్తు మందిచ్చి రేప్ చేశాడంటూ భగీరథ్ పై 17 ఏళ్ల మైనర్ మే 8న కేసు పెట్టినా భగీరథ్ పై చర్యలు తీసుకోలేదని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.

అంతేకాదు, హనీ ట్రాప్ అంటూ ఆ మైనర్ పై భగీరథ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు నుండి తప్పించుకునేందుకు తమ కూతురిపైనే బండి భగీరథ్ తప్పుడు కేసులు పెడుతున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, బండి సంజయ్, భగీరథ్ లను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. వాస్తవానికి పోక్సో కేసు పెట్టిన 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది.

కానీ, మూడు రోజులైనా భగీరథ్ ను అరెస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసుకు సంబంధించి లోతైన విచారణ చేపట్టాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మూడు రోజులైనా విచారణ ఎందుకు మొదలుకాలేదని సీవీ ఆనంద్ ను రేవంత్ ప్రశ్నించారు. అయితే, ప్రధాని మోదీ పర్యటన భద్రతా ఏర్పాట్లలో పోలీసులంతా బిజీగా ఉన్నారని ఆయన సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణ కోసం మహిళా డీజీపీ ఆధ్వర్యంలో సిట్ కూడా ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.