పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజవడం ఆయన అభిమానులకు అరుదైన అనుభవమే. 2024 ఎన్నికలకు ముందు పెండింగ్ పెట్టిన మూడు సినిమాలను చకచకా పూర్తి చేసేయడంతో గత ఏడాది జులై నుంచి ఈ ఏడాది మార్చి లోపు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు రిలీజైపోయాయి. వీటిలో ‘ఓజీ’ మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకోగా.. మిగతా రెండు చిత్రాలు నిరాశపరిచాయి.
ఐతే ఈ మూడు సినిమాలతో పవన్ సినీ ప్రయాణం ముగిసిపోతుందేమో అనుకున్నారు కానీ.. ఆయన మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సురేందర్ రెడ్డి చిత్రానికే. ఆ సినిమాను కొన్ని నెలల ముందే అనౌన్స్ చేశారు. సురేందర్ అండ్ టీం ఈ కథ మీద పని చేస్తున్నారు. మరోవైపు సుజీత్ ‘ఓజీ-2’ స్క్రిప్టు పనుల్లోకి దిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఐతే ఇప్పుడు పవన్తో సినిమా చేయడానికి ఎవ్వరూ ఊహించని ఒక వ్యక్తి రెడీ అయ్యారు. ఆయనే జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయాక, బాలినేని జనసేనలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన జనసేన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ ఎప్పుడు కాల్ షీట్లు ఇస్తే అప్పుడు ఆయనతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు. ఎప్పుడూ రాజకీయాలతో తీరిక లేకుండా ఉండే బాలినేని.. పవన్తో సినిమా తీయడమేంటి అని ఆ సమావేశంలో పాల్గొన్న వారితో పాటు మిగతా జనసైనికులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
బాలినేని యథాలాపంగా ఈ మాట అన్నారా.. లేక నిజంగానే పవన్తో సినిమా చేసే ప్లాన్లో ఉన్నారా అని అందరూ చర్చించుకుంటున్నారు. బాలినేని సీరియస్గా సినిమా చేయాలని ప్రయత్నం చేస్తే పవన్ ఒప్పుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు తాను తిరిగి వైసీపీలోకి వెళ్లబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బాలినేని ఖండించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates